తిరుపతి జిల్లా : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. రెండో రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం భాష్యకార్ల సన్నిధి వద్ద యిహల్ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.