జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల మనం మోసపోతాం, గాయపడతాం. మనసు ముక్కలైనప్పుడు, ‘నన్ను ఏడిపించిన వాళ్లను నేను కూడా ఏడిపించాలి’ అనే ప్రతికారేచ్ఛ రగలడం సహజం. ‘దెబ్బకు దెబ్బ’ తీర్చడమే న్యాయం అనిపిస్తుంది. కానీ, నిజంగానే పగ తీర్చుకుంటే మనసుకు ప్రశాంతత దొరుకుతుందా? అసలు ఇస్లాం ఈ విషయంలో ఏం చెబుతుంది? ‘సబ్’్ర అంటే కేవలం భరించడం కాదు! ముస్లింల కుటుంబాల్లో తరచూ వినిపించే పదం ‘సబ్’్ర (ఓర్పు/సహనం). ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఏదైనా ఆపద ముంచుకొచ్చినా పెద్దలు చెప్పే మొదటి మాట… ‘ఓపిక పట్టమ్మా… అల్లాహ్ ఉన్నాడు’ అని. అయితే, ప్రకృతి సిద్ధంగా వచ్చే కష్టాలను భరించడం ఒకెత్తయితే, ఎదుటి మనిషి చేసిన అన్యాయాన్ని ఓర్చుకోవడం మరొకెత్తు. మనల్ని ఒకరు చెంపదెబ్బ కొడితే, తిరిగి కొట్టే హక్కును ఇస్లామిక్ చట్టం (షరియా) ఇస్తుంది. పవిత్ర ఖురాన్ కూడా… కీడుకు ప్రతిఫలం, దానికి సమానమైన కీడే అని స్పష్టం చేసింది. అయితే, కథ అక్కడితో ముగిసిపోలేదు!
మనకు హాని చేసిన వాడిని తిరిగి దెబ్బకొట్టే హక్కు మనకున్నా… అల్లాహ్ మరో అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎవరైతే క్షమించి, రాజీ పడతారో… వారికి లభించే ప్రతిఫలం నేరుగా అల్లాహ్ బాధ్యత అని ఖురాన్ గుర్తు చేస్తుంది. నిజానికి, పగ తీర్చుకోవడం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. అది మన నుంచి సమయాన్ని, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని లాగేసుకుంటుంది. ఒకరు మనకు కీడు చేయడం, మనం వారిపై ప్రతికారం తీర్చుకోవడం, దానికి వాళ్లు మరింత కసితో ఇంకో దెబ్బ కొట్టడం… ఇలా ఈ ‘ప్రతికారం’ తో ఊగిపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది. జీవితంలో ముందడుగు వేయలేం. అందుకే, ప్రాపంచికంగా చూసినా… ఎదుటివాడిని క్షమించి వదిలేయడమే మన మానసిక ఆరోగ్యానికి చాలా ‘మంచి’ మార్గం! ఎవరినైనా ‘క్షమించడం’ అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, లేదా ఎదుటివాడి ముందు ‘ఓడిపోవడం’ అంతకన్నా కాదు. అది మనకు, సృష్టికర్తకు మధ్య ఉన్న ఒక సంబంధం. క్షమించే గుణం ఉన్నవాడే అసలైన బలశాలి. ఆ క్షమాగుణమే మిమ్మల్ని దైవానికి మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి, పగ అనే భారాన్ని గుండెల్లో మోస్తూ జీవితాన్ని వృథా చేసుకోకండి… క్షమించేయండి, ప్రశాంతంగా ముందడుగు వేయండి! మరి మనం ‘క్షమించలేమా!’ ఆలోచించండి.