బుధవారం షబే మేరాజ్
ఒకానొకసారి యుద్ధంలో హజ్రత్ అలీ (రజి)కి విషపు బాణాలు గుచ్చుకుంటాయి. ఆయన్ను చెట్టుకు కట్టేసి బాణాలు తొలగిద్దామని వైద్యుడు సూచిస్తాడు. దానికి హజ్రత్ అలీ ఒప్పుకోరు. బాణాలు తీసే క్రమంలో నొప్పి భరించలేనంతగా ఉంటుందన్నాడు వైద్యుడు. ‘అయితే, నేను నమాజ్లో లీనమైనప్పుడు బాణాలు తొలగించండి’ అన్నారు హజ్రత్ అలీ. అంతలోనే నమాజ్ వేళయింది. హజ్రత్ అలీ ప్రార్థనకు పూనుకున్నారు. అప్పుడు వైద్యులు బాణాలను తొలగించారు. నమాజ్లో ఉన్న హజ్రత్ అలీ (రజి) బాణాలు తొలగించిన సంగతిని కూడా గుర్తించలేదు. ప్రార్థనా సమయంలో శ్రద్ధాభక్తులు ఎలా ఉండాలో వివరించడానికి ఉలేమాలు ఈ కథను ఉటంకిస్తారు.
ఇస్లామ్ ఐదు మూల స్తంభాల్లో నమాజ్ ఒకటి. అల్లాహ్ను విశ్వసించేవారు ఐదు పూటలా నమాజ్ విధిగా చేయాలన్నది దైవ ఆదేశం. అల్లాహ్ ఆదేశాలు, ఇస్లామ్ ధర్మ విధి విధానాలు జిబ్రీల్ దూత ద్వారా ముహమ్మద్ ప్రవక్త (స) వరకూ చేరాయి. అవన్నీ ఖురాన్ రూపంలో నిక్షిప్తంగా ఉన్నాయి. ఐదు పూటలా చదివే నమాజ్ ప్రవక్తకు అల్లాహ్ ఇచ్చిన కానుక. జిబ్రీల్ దూత ప్రవక్తను రాత్రికి రాత్రి సప్త ఆకాశాల పైనున్న అల్లాహ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ అల్లాహ్ నమాజ్ను ప్రవక్తకు కానుకగా అందించాడు. ఈ అపురూప ఘటన జరిగిన రోజును ‘షబే మేరాజ్’గా ముస్లిమ్లు జరుపుకొంటారు. ఇస్లామియా కాలమానం ప్రకారం రజబ్ నెల 27వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇస్లామ్ చరిత్రలో, ఖురాన్ గ్రంథంలో షబే మేరాజ్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే, ముస్లిమ్లు ఐదు పూటలా విధిగా నమాజ్ చేయాలని ప్రవక్త ఉద్బోధ. నిర్ణీత వేళల్లో నమాజ్ చేసేవారంటే అల్లాహ్కు ఎంతో ప్రీతి అని ప్రవక్త (స) చెప్పేవారు.
..?ముహమ్మద్ ముజాహిద్
96406 22076