ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్
(భగవద్గీత 3-43)
‘ఓ అర్జునా! ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధికన్నా ఆత్మ గొప్పవి. ఆత్మే అన్నిటి కన్నా సూక్ష్మము, బలీయము, శ్రేష్ఠతమము. కాబట్టి బుద్ధి ద్వారా మనసును అదుపులో ఉంచుకొని, దుర్జయ శత్రువైన కామమును జయించాల’ని చెబుతున్నాడు, కృష్ణ పరమాత్మ.
కామము అంటే లైంగిక వాంఛ మాత్రమే కాదు. వ్యక్తిలోని తీవ్రమైన కోరిక. ఉత్తమత్వాన్ని పొందడం మనిషిగా సాధించవలసిన లక్ష్యం. ఆ క్రమంలో విచక్షణా జ్ఞానాన్ని బుద్ధి ప్రసాదిస్తే, అంతశ్శత్రువులైన అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) జయించడం సాధ్యపడుతుంది. తద్వారా కామవిక్షేపాలకు లోనయ్యే మనసు ప్రశాంతమవుతుంది. మనసు బుద్ధి ఆధీనంలోకి వస్తుంది.
జ్ఞానము సాధారణంగా అజ్ఞానంతో కప్పి ఉంటుంది. దానితో స్వస్వరూపాన్ని గుర్తించడం సాధారణ జనులకు దుర్గమంగా మారుతుంది. స్వయం ప్రకాశమైన ఆత్మ శ్రేష్టమైనదే అయినా మనం దాని శక్తిని మరచి కామం అనే శత్రువుకు వశమవుతున్నాం. గురువుల బోధనలు, శాస్త్రజ్ఞానం మార్గాన్ని చూపుతాయి. అయితే ఆత్మపరిజ్ఞానం స్వానుభూతి ద్వారా మాత్రమే స్థిరపడుతుంది. కామం లయం కావాలి అంటే ఆత్మజ్ఞానం అలవడాలి. బుద్ధి నిత్యానిత్య వివేచనా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సకల ప్రాణుల్లో దాగి ఉన్న ఆత్మ, సాధారణ మనుజులకు ప్రత్యక్షంగా గోచరింపదని అంటుంది, కఠోపనిషత్తు.
బుద్ధి ద్వారా మనసును వశపరుచుకోవడానికి, అభ్యాసం, వైరాగ్యం అనే రెండు మార్గాలను సూచించారు. ఇష్టాయిష్టాలకు అతీతంగా, జీవన ప్రయోజనమైన ఆత్మను తెలుసుకునే విధానాన్ని అనుసరించాలి. ఇంద్రియ భోగాలను, సుఖదుఃఖాలను, దోషాలను క్రమక్రమంగా దూరం చేసుకోగలిగితేనే పరమాత్మయందు చింతన నిలుస్తుంది. దానిని నిరంతరం అభ్యాసం చేయడం వల్ల జీవన ప్రయోజనం సిద్ధిస్తుంది.
దీనిని నిత్య జీవితంలో ముఖ్యంగా ఆధునిక కార్యాలయ జీవితంలో అన్వయించుకుంటే.. కామం అనేది కార్పొరేట్ ప్రపంచంలో ‘నేనే’ అగ్రస్థానంలో ఉండాలనే పోటీతత్వం. అధిక జీతం కోసం ఆరాటం, పదోన్నతుల కోసం ఆతృత, తనకే గుర్తింపు రావాలనే తపన, అధికార దాహం, ఇతరులతో పోల్చుకోవడం.. ఇవన్నీ నియంత్రణ లేకుండా జీవితాన్ని ఆక్రమిస్తే వ్యక్తిలో ఒత్తిడి, అసంతృప్తి, అసూయ, అనైతిక ప్రవర్తనలకు దారితీస్తాయి. ఇది మానసిక పరిణామం.
మనసు కంటే బుద్ధి గొప్పది. కార్యాలయంలో చాలాసార్లు మనసు తక్షణం ప్రతిస్పందిస్తుంది. విమర్శ వింటే కోపం రావడం, ఇతరుల విజయానికి అసూయపడటం లాంటివి మానసిక ప్రతిక్రియలు. ఆ సమయంలో బుద్ధి.. ఇది సమంజసమా? తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఈ నిర్ణయం వల్ల స్వల్పకాల, దీర్ఘకాల ప్రభావాలు ఎలాంటివి? ఎలా, ఎప్పుడు స్పందించాలి? అంటూ ప్రశ్నిస్తుంది. దీనినే గీతలో చెప్పిన ‘సంస్తభ్యాత్మానమాత్మనా’ అనే భావానికి అన్వయించు కోవచ్చు.
అరిషడ్వర్గం కార్పొరేట్ రూపం అనుకుందాం. ఇందులో కామమనేది ఆశలు (ఆశయాలు కాదు), వ్యామోహాలు. క్రోధమనేది బృందసభ్యులతో గొడవలు, అసహనం. లోభమనేది ధనదాహం, అనైతిక లాభాలపై ఆపేక్ష. మోహమనేది ఉన్నత పదవులపై అలవిమాలిన ఆసక్తి. సంస్థపై మమకారం. మదమనేది అహంకారం, అధికార గర్వం. మాత్సర్యమనేది సహోద్యోగులపై ఈర్ష్య, అసూయలు. ఈ ఆరు శత్రువులలాగా వ్యక్తిగత ప్రగతిని అడ్డుకుంటాయి, నైతిక వర్తనను దారి మళ్లిస్తాయి. వీటిని అదుపు చేసుకో గలిగితే వ్యక్తి ఉత్తమనాయకుడిగా ఎదుగుతాడు.
నిరంతరం నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం అభ్యాసం ద్వారా సాధ్యపడుతుంది. సమయపాలన, భావోద్వేగ నియంత్రణ, ఆత్మపరిశీలన ద్వారా సత్ప్రవర్తనను అలవరుచుకోవడం సాధ్యపడుతుంది. అలాగే ఫలితాలను కాకుండా ప్రక్రియపై దృష్టి పెట్టడం, ప్రశంసలు లేదా విమర్శల పట్ల అనాసక్తిని ప్రదర్శించడం, బాధ్యతా నిర్వహణలో వ్యక్తిత్వాన్ని మిళితం చేయకపోవడం వల్ల వైరాగ్యం కలుగుతుంది. దానితో విజయం లభిస్తుంది. ఒకవేళ విఫలత కలిగినా దానిని సమభావంతో స్వీకరించడం వల్ల అసంతృప్తిని జయించ గలుగుతాం. అయితే ఇది కర్తవ్య నిర్వహణకు పరిమితం కావాలే కాని నిర్లక్ష్యం కారాదు.
ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి? వ్యక్తిగత బలాబలాలు, విలువలు, జీవిత లక్ష్యాలు, ఉద్దేశాలు స్పష్టమవుతాయి. చేసే పనిలో పవిత్రత, స్వచ్ఛత వ్యక్తమవుతుంది. ఇలాంటి అవగాహన పెరిగినప్పుడు వ్యక్తి బాహ్య పరిస్థితులకు బానిస కాకుండా, తన విలువల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. కోరికలు, భావోద్వేగాలు, పోటీతత్వం, అహంకారం వంటి అంతర్గత శక్తులు మందగించి వ్యక్తి ప్రవర్తన చెడు దారిలో నడపకుండా, వివేకంతో, బుద్ధితో వాటిని నియంత్రించి, ఉన్నత లక్ష్యాల వైపు వృత్తి జీవితాన్ని నడిపించుకో గలుగుతాడు. లౌకిక జీవితాన్ని రసమయం చేసుకుంటాడు. కామాన్ని జయించడం అంటే కోరికలను నిర్మూలించమని కాదు.. వాటికి బానిస కాకుండా వివేకంతో ప్రవర్తించమని మాత్రమే. కృష్ణపరమాత్మ ఆధ్యాత్మిక ఉపదేశం చేస్తూనే ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, సమర్థవంతమైన నాయకత్వాన్ని, వృత్తిపరమైన నైతికతను, మానసిక స్థిరత్వాన్ని, దీర్ఘకాల విజయ సాధనకు అవసరమైన మార్గాన్నీ దర్శింపజేశాడు.
– పాలకుర్తి రామమూర్తి