అనేక మతాలు. అనేకానేక భాష్యాలు. నాస్తిక వాదాలు. ఏది సత్యమో, ఏది అసత్యమో అర్థంకానంత అయోమయం. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో సామాన్య సాధకులకు అనేక అవరోధాలు. అప్పుడే, మలయమారుతంలా ధార్మిక జగత్తులో అవతరించారు మధ్వాచార్యులు. క్రీ.శ 1238లో కర్ణాటక రాష్ట్రం ఉడుపి సమీపంలోని పాజక క్షేత్రంలో జన్మించారు ఆచార్యులు. పూర్వాశ్రమ నామం వాసుదేవుడు. పదకొండేండ్ల వయసులో.. తన గురువు అచ్యుత ప్రజ్ఞుల చేతుల మీదుగా సన్యాసం స్వీకరించి.. పూర్ణ ప్రజ్ఞులు అయ్యారు. ద్వైతమే పరమధర్మమని నిరూపించారు. ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు, భగవద్గీతకు టిప్పణి రాశారు.
గీతాభాష్యం, గీతా తాత్పర్యం, న్యాయ వివరణ తదితర రచనలు సుప్రసిద్ధాలు. ఉడుపిలోని సుప్రసిద్ధ కృష్ణాలయాన్ని వెలుగులోకి తెచ్చారు. అక్కడే అష్టమఠాలను స్థాపించి.. ద్వైత ధర్మ పరివ్రాజకులను నియమించారు. జగత్తు సత్యం. జీవుడు బ్రహ్మ ఒకటి కాదు. ఇవి రెండూ వేరువేరు తత్వాలు. పరమాత్మ సగుణసాకారుడు. మోక్షానికి విష్ణుభక్తే ఏకైక మార్గం.. అని బోధించారు. శంకరుల అద్వైతాన్ని ఖండించారు. భగవన్నామ స్మరణను ప్రోత్సహించారు. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపరలో భీముడు, కలియుగంలో మధ్వాచార్యులు.. వాయుదేవుడి అంశగా జన్మించారని మధ్వ సంప్రదాయాన్ని అనుసరించేవారి విశ్వాసం.