వేదాహం సమతీతాని వర్తమానానిచార్జున
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన!
(భగవద్గీత – 7-26)
ఓ అర్జునా! గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయేవి, సమస్త ప్రాణుల స్థితిగతులు నాకు తెలుసు. కానీ జీవులు మాయతో మిళితమైన వారి అజ్ఞానం, దానివల్ల పొందిన రాగద్వేషాల కారణంగా నా (పరమాత్మ) నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు. నాపై భక్తి శ్రద్ధలు కలిగిన వారు తప్ప వేరెవ్వరూ నన్ను తెలుసుకోలేరు.. అంటూ సర్వజ్ఞత్వాన్ని ప్రకటిస్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ.
‘భూతాని’ అనడం ద్వారా చరాచర సృష్టిలోని జీవుల జనన, కర్మ, స్వభావ, గమ్యాల గురించి సమగ్ర సమాచారం భగవంతునికి తెలుసు. ఇక్కడ కాలాన్ని ‘భూతభవిష్యత్ వర్తమానాలు’గా చెప్పారు. కానీ కాలానికి కొలమానం, కాలభేదం లేదు. అది వ్యావహారిక సత్యమే. జీవి అనుభవాలు, అంచనాలు, జ్ఞాపకాలే కాలం. అందువల్ల కాలంగా మనం నిర్వచించుకునే సమస్తం కాలస్వరూపుడైన భగవంతునికి ప్రత్యక్షం, వర్తమానమే.
పరమాత్మ ‘భవిష్యత్తు తెలుసు’ అన్నాడు. అంటే జీవికి స్వేచ్ఛ లేనట్లు కాదు. భగవద్గీత చెప్పినట్లుగా జీవికి కర్మాచరణలో స్వాతంత్య్రం ఉంది కానీ… వాటి ఫలితాలు, పరిణామాలను నిర్వచించుకోవడంలో లేదు. కృష్ణపరమాత్మ చెప్పే ఈ సందేశాన్ని కేవలం బుద్ధితో లేదా హేతువుతో కాదు భక్తిశ్రద్ధలతో, సర్వసమర్పణా భావనతో మాత్రమే ఆయన స్వరూపాన్ని తెలుసుకోగలం.
దీనిని నిజజీవితంలో అన్వయించుకుంటే.. ఏదైనా సమష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు, దార్శనికత కలిగిన కొందరు తమ జ్ఞానాన్ని, అనుభవాలతో సమన్వయం చేసుకుంటారు. ఆ నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అంచనా వేసి, మంచి మార్గాన్ని సూచిస్తారు. స్వార్థప్రయోజనాలపై ఆసక్తి ఉన్న వారు దీర్ఘకాలిక పరిణామాలను గుర్తించలేక, తాత్కాలిక ప్రయోజనాలు, భావోద్వేగాల ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వారికీ, సమాజానికీ కూడా నష్టం వాటిల్లుతుంది. జ్ఞానం, నైపుణ్యం, అనుభవం, వివేకం, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ కలిసి నడిస్తే సామాజిక శ్రేయస్సు ఆవిష్కృతమవుతుంది.
ఒక ఊరి పక్కనున్న చెరువు చుట్టూరా చెట్లను కొందరు కొట్టివేయడం గమనించాడు ఊరి పెద్ద. ‘ఈ చెరువు చుట్టూ ఉన్న చెట్లను నరకవద్దు. ఇవే వర్షాలను ఆకర్షిస్తాయి, నీటిని నిల్వ చేస్తాయి. ఇంత పెద్దచెట్లను నరికి పర్యావరణాన్ని నాశనం చేస్తే, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడి, వాతావరణ మార్పులు వస్తాయ’ని వారిని అడ్డుకున్నాడు. ఆతని మాటలను పట్టించుకోని స్వార్థపరులు ‘కలప అమ్మితే మంచి డబ్బు వస్తుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి?’ అని చెట్లన్నీ నరికేశారు. దాంతో కొద్దిరోజుల్లోనే వర్షాలు తగ్గిపోయి, చెరువులు ఎండిపోయి, పంటలు పండలేదు. తాగునీటికి కూడా కొరత ఏర్పడింది.
మానవుడు కాలబద్ధుడు. భగవంతుడు కాలాతీతుడు, సర్వజ్ఞుడు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఆయనకు ప్రత్యక్షమే. భగవంతునిపై భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలిగినవారే నిబద్ధతతో ఆయన సూచించిన మార్గాన్ని అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టి తమ జీవితాలను సార్థకం చేసుకోగలరు. జ్ఞానులు భవిష్యత్తును నియంత్రించాలని ప్రయత్నించరు. కానీ వర్తమానాన్ని లోతుగా విశ్లేషించుకొని, జరగనున్న పరిణామాలను అంచనా వేస్తూ, భవిష్యత్తుకు మనల్ని సిద్ధంచేస్తారు. తదనుగుణంగా ప్రవర్తిస్తే శ్రేయస్సును పొందగలం. అలాంటి వారి మార్గదర్శనయే ప్రపంచాన్ని నడిపిస్తుంది.