శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. కార్తీక రెండో సోమవారం సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. అర్చక వేదపండితులచే ఉభయ దేవాలయాల్లో నిత్యకైంకర్యాలతోపాటు పరివార దేవతలకు షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లను పల్లకీలో వేంచేపు చేసి.. ఆలయంలో ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత పుష్కరిణి వద్ద పుష్కరిణి వద్ద సంకల్ప పూజలు నిర్వహించారు.
అనంతరం లక్ష దీపార్చాన, అలాగే దశవిధ హారతి కార్యక్రమం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కార్యక్రమాన్ని సందర్శించి, ఆది దంపతుల ఆశీర్వాదాన్ని పొందారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ, ముఖ్య అర్చకులు హరిస్వామి, ఈఈ మురళీబాలకృష్ణ, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, ఆలయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
క్షీరాబ్ధి ద్వాదశి ప్రత్యేక పూజలు..
కార్తీకమాసం రెండవ సోమవారం రోజునే క్షీరాబ్ధి ద్వాదశి పర్వదిన ప్రత్యేక పూజలను శాస్ర్తోక్తంగా చేసుకున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ మహిళా విభాగం అధ్యక్షరాలు మంకాల పద్మావతి మణిస్వామి చెప్పారు. శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీకమాసంలో స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తూ ఇంట్లో తులసి, ఉసిరిచెట్ల కల్యాణాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు.
రూ.15లక్షల విరాళం
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేశ్ సదనానికి రూ.పది లక్షల విరాళాన్ని ఇచ్చారు. సోమవారం కర్నూలుకు చెందిన మల్లేశ్వర్రెడ్డి దంపతులు ఈవో లవన్నను కలిసి చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.