శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ సోమవారం సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. అర్చక వేదపండితులచే ఉభయ దేవాలయాల్లో నిత్యకైంకర్యాలతోపాటు పరివార దేవతలకు షోడషోపచార పూజలు చేశారు.
సాయంత్రం ఆలయ ప్రధాన ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించిన అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకీలో వేంచేపుచేసి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం పుష్కరిణి వద్ద అధిష్టించి సంకల్ప షోడష పూజాధికాలు చేశారు. లక్ష దీపార్చనలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి అధికంగా వచ్చిన మహిళలు, భక్తులు దీపాలు వెలిగించారు.
దశవిధ హారతుల దర్శన భాగ్యాన్ని తెలుపుతూ ప్రవచనపూర్వక కార్యక్రమాలను నిర్వహించగా.. భక్తులు తిలకించి ఆది దంపతుల ఆశీర్వాదం పొందారు. పుష్కరిణి వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ, ముఖ్యార్చకులు హరిస్వామి, ఈఈ మురళీబాలకృష్ణ, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, ఆలయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.