తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. గర్భాలయంలో మూలవిరాట్కు వస్త్రం కప్పి గర్భాలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధి కార్యక్రమం చేపట్టాగా, కులశేఖరపడి నుంచి మహాద్వారం వరకూ ఆలయ శుద్ధి చేపట్టారు అధికారులు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.
శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శ్రీవారి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఏడాదిలో ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడుతామని చెప్పారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజు మూలవిరాట్ను వస్త్రంతో కప్పి, శుద్ధి కార్యక్రమం చేపడుతామన్నారు. ఉదయం ఆరు గంటల నుండి 11 గంటల వరకూ ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరుగుతుందన్నారు. గర్భాలయంలో అర్చకులు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడితే, కులశేఖర పడి నుంచి మహాద్వారం వరకూ ఉన్న ఆలయ పరిసరాలను, ఉపదేవాలయాలను నీటిని శుభ్ర పరిచి తిరుమంజనాన్ని గోడలకు టీటీడీ అధికారులు సిబ్బంది అంటించారని వివరించారు.
తిరుమంజనం అనేకమైన ఔషదాలు, మూలికలతో తయారు చేసిన ఒక దివ్య పదార్థమని, అధర్వణ వేదంలో ఆయుర్వేదంలో తిరుమంజనం గురించి వివరించడం జరిగిందని, తిరుమంజనంలో కలిపే మూలికల కారణంగా మరో నాలుగు నెలల వరకూ ఆలయం పరిశుభ్రంగా ఉండి, క్రిమి కీటకాల చేరకుండా గోడలు ధృడంగా ఉండే విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు.