తిరుమల : డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar reddy), అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు.
టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శతాబ్దాల నాటి ఆలయ శుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనందంగా ఉందని ఆలయంలో దైవత్వాన్ని, తపస్సును చేసినట్లు ఉందని పేర్కొన్నారు. నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేశామని వివరించారు. తిరుమంజనం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.