తిరుమలలో కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వైఖానస మహర్షి శిష్యుల్లో ఒకరైన కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా జరిపారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం మూలమని టీటీడీ వైఖానస ఆగమసలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు పేర్కొన్నారు. వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు ఉత్సవాలు శ్రీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని, ఈ ఆగమ శాస్త్రాన్ని శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథంలో వైఖానస విధివిధానాలతో సమగ్రంగా వివరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు సీతారామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.