TTD News | తిరుమలలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ పరిపాలన భవనం మైదానంలో దీపోత్సవాన్ని చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత భక్తశ్రద్దలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకున్నది.
భక్తులనుద్దేశించి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్తీక మాసంలో టీటీడీ శివ కేశవ పూజల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది కార్తీక మాసంలో యాగంటి, విశాఖపట్నం, తిరుపతిలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తి ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు టీటీడీ కృషి చేస్తుందన్నారు.
పవిత్ర కార్తీక మాసం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు. పండితులు డాక్టర్ మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డాక్టర్ మారుతి దీప ప్రాశస్త్యం గురించి తెలియజెప్పారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా శ్రీవారి తిరువారాధన నిర్వహించారు. పండితులు విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. భక్తులతో దీప మంత్రం 9 సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ సామూహికంగా చేసిన దీపారాధన వెలుగులతో మైదానం నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఈఓ ధర్మారెడ్డి దంపతులతో పాటు టీటీడీ జేఈఓలు శ్రీమతి సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర , టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, మురం శెట్టి రాములు, మారుతి ప్రసాద్, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈలు జగదీశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు, అర్చక బృందం , వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి సహకారం అందించింది. దాతలను ఈఓ ధర్మారెడ్డి సన్మానించారు.