శ్రీశైలం : శ్రీశైలంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో ఉన్న గంగాధర మండపం వద్ద గురువారం రాత్రి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. అంతకు ముందు జ్వాలాతోరణానికి ఉపయోగించే వొత్తులను ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం సాంప్రదాయంగా వస్తుందని వారు తెలిపారు.
జ్వాలాతోరణోత్సవం..
త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టిదోషనివారణ కోసం పార్వతీదేవి తొలిసారిగా జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించినట్లు పురాణ ఇతిహాసాల్లో ఉన్నందున శ్రీశైల క్షేత్రంలో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈవో లవన్న చెప్పారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకువచ్చి దీపప్రజ్వలన కార్యక్రమాన్ని జరిపించినట్లు ఈవో తెలిపారు.
ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మారాయి. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, విద్యాగణేశానంద భారతి పీఠాధిపతులు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
శివన్నాస్మరణతో మార్మోగిన శ్రీగిరులు
శ్రీశైల మహా క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శనానికి తరలివచ్చారు. గురువారం సాయంత్రం క్షేత్రానికి వచ్చిన భక్తులు ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకోవడంతోపాటు సాంప్రదాయ దుస్తులు ధరించి సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన చేసుకునేందుకు ఆసక్తి చూపారు. వర్షం కారణంగా భక్తులకు ఇబ్బందులెదురవగా.. క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు.
అన్నదాన భవనాల్లో విడుతల వారీగా అల్పాహార, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సాయంత్రం దక్షిణ మాడవీధిలో కళారాధన కార్యక్రమంలో మహబూబ్నగర్కు చెందిన శ్రీసాయికృపా కూచుపూడి నృత్య అకాడమి, హైదరాబాద్కు చెందిన తాండవం కూచిపూడి నాట్యాలయం నృత్య నవేదన అలరించింది. ప్రధానంగా మహబూబ్నగర్కు చెందిన చిన్నారులు శ్లోక, వర్షిత, అక్షర, రాగసుధ, పరిమళ, అమూల్య, కల్పన, మేఘన, తనూశ్రీ, ఆదిశ్రీ, చైత్రిక, శ్రేష్ట, వాణిలు చేసిన శివాష్టకం, మహాగణపతిం, నమ్మశ్శివాయతే నృత్యరూపకాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనాలు ప్రారంభం
శ్రీశైల మహాక్షేత్రానికి పరివార దేవత అత్యంత మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయ దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువై చెంచుల ఆరాధ్య ధైవంగా పూజలందుకుంటున్న అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇదే అదునుగా కొందరు భక్తులను దగా చేస్తున్నారని అటవీ శాఖ గత మూడు సంవత్సరాలుగా ఆలయ దర్శనానికి అనుమతిని పూర్తిగా రద్దు చేసింది.
భక్తుల విశ్వాసాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవతీసుకుని ప్రభుత్వాధికారులు, అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చించి అమ్మవారి ఆలయ దర్శనాలకు భక్తులకు అనుమతిని ఇప్పించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ఆలయానికి వెళేందుకు వేసిన రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 10 వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. త్వరలో ఓ ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు నేరుగా తమ టిక్కెట్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.