మోక్షపురి కాశి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. సాక్షాత్తూ విశ్వనాథుడి రాచనగరి అష్టదిశల్లో భైరవస్వామి కొలువుదీరాడు. అదే తరహాలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి ఎనిమిది దిక్కుల్లో అష్టభైరవులు కొలువై ఉన్నారు. వీరు నిరంతరం గ్రామాన్ని రక్షిస్తుంటారని నమ్మకం. అయితే, ఏడు భైరవ విగ్రహాలు కాలగమనంలో కనుమరుగయ్యాయి. ఎనిమిదో మూర్తి ఇస్సన్నపల్లిలోని శ్రీకాలభైరవుడు. స్వామి వెలసిన ఈ క్షేత్రం దక్షిణకాశిగా విరాజిల్లుతున్నది. ఆ క్షేత్ర వివరాలు, అక్కడ కొలువై ఉన్న భైరవుడి విశేషాలు ఇవి..
పరమశివుడి రౌద్ర స్వరూపమే కాలభైరవుడు. ఆ స్వామిని నమ్మి పూజించిన వారిని దక్షతతో రక్షిస్తుంటాడు. ఇస్సన్నపల్లిలో భైరవుడు సిందూరమూర్తిగా కనిపిస్తాడు.
తొమ్మిది అడుగుల మూలమూర్తి దర్శనంతో సమస్త గ్రహదోషాలూ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దిగంబర రూపంలో కొలువై ఉన్న స్వామి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి నిత్యం సిందూరం అద్దుతారు. చతుర్భుజాలతో, కోరమీసంతో, వెండికన్నులతో దండిగా వరాలు కురిపిస్తాడు భైరవుడు. స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలోనే శివాలయాన్ని సందర్శిస్తారు. అంతకుముందు గుడి ప్రాంగణంలోని కోనేరుకు ఎనిమిది ప్రదక్షిణలు చేసి అందులో పుణ్యస్నానం ఆచరిస్తారు. కాలభైరవుడి దర్శనం కోసం తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఏటా కార్తిక కృష్ణ అష్టమి సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు వస్తారు. మార్గశిర కృష్ణ అష్టమి సందర్భంగానూ కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం కూడా స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు.