తాను కాని జడములైన దేహాదులను తాను అనీ, తనవి అనీ భ్రాంతి పడటమే మోహం- అజ్ఞానం.
ఆ భ్రమ తొలగటమే ప్రమ- యథార్థ జ్ఞానం. ‘జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః’
(గీత)- ఆ అజ్ఞానం పరమాత్మ జ్ఞానం కలిగితేనే నశిస్తుంది. అజ్ఞానం అంతరించడానికి జ్ఞానోదయం ఎలా అనివార్యమో, దేహాభిమాన నివృత్తికి, దైత్య వినాశనానికి భగవదవతారం అంత ఆవశ్యకం.
అవతారం భగవంతునికి లీల- వినోదం. భక్తులకు తత్తజ్ఞాన ప్రదం- ప్రమోదం. ప్రాపంచికంగా లోకంలో ఏ విషయం విష సమానమో- దోషమో, పాపమో, దూషణమో, పరమాత్మ పరమైతే అదే అమృత తుల్యం- గుణము, పుణ్యము, భూషణమవుతుంది. తృష్ణ, కామ, లోభాది అశుభ వాసనలు కూడా కృష్ణ సంబంధితాలైతే ఆత్మీయ ఆభరణాలవుతాయి. మాధవాశ్రితము, అర్పితమూ అయిన
ఏ విషయమైనా మహిమాన్వితమవుతుంది. కృష్ణచంద్రుని చోరత్వ జారత్వాలు కూడా ఆశ్రయ మహత్తం వలన చాటుమాటు పాపాలు పోగొట్టేవి, కోటికోటి పుణ్యాలు మూటకట్టేవిగా పరిణమిస్తాయి.
శుక మహర్షి పరీక్షిత్తుతో.. రాజా! ఒకనాటి ప్రొద్దున వెన్నుడు- బాలకృష్ణుడు మన్ను తిన్నాడని రామన్న, ఇతర గొల్లపిల్లలు కన్నయ్యను తీసుకువచ్చి తల్లి యశోదతో వెల్లడించారు. ఆమె పాపని చేయి పట్టుకొని కోపం నటిస్తూ ఇలా అన్నది…
కం॥ ‘మన్నేటికి భక్షించెదు
మన్నియమములేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పద
రన్నా! మన్నేల మరి పదార్థము లేదే?’
‘కన్నా! మన్నెందుకు తిన్నావురా? నేను అన్న (చెప్పిన) నియమాలను ఎందుకు మన్నించవు (పాటించవు)? బిడ్డా! తల అలా అడ్డంగా ఊపుతావేల? నీ అన్న రామన్న, నీ వెంట ఉన్న పిల్లలు అందరూ చెబుతున్నారు. అయినా, మట్టి తినవలసిన కర్మ నీకేమి పట్టిందిరా? ముద్దుల పట్టీ! (కొడుకా) తినడానికి ఇంట్లో వేరే గట్టి పదార్థాలే లేవా?’ అంటూ చిన్నారి చిట్టి-చిట్టి చేతులను తన చేతిలోనికి తీసుకొని, రెండో చేతిలో బెత్తం పట్టుకొని ఝళిపిస్తూ మట్టి ఎందుకు తిన్నావో చెప్పమని రెట్టించి గట్టిగా గద్దించింది.
‘భయానాం భయం భీషణం భీషణానాం..’ భయానికే భయంకరుడు, భీషణులకు కూడా విభీషణుడు, ఆశ్రితులకు అభయంకరుడు అయిన భగవంతుడు భయపడిపోయాడు. ‘ఇప్పుడు అబద్ధం చెప్పకపోతే ఒంటిమీద వెంటనే దెబ్బపడక తప్పదు. కనుక, ఈ అపాయం తప్పించుకోవటానికి ఒక కల్ల (అసత్యం) ఆడతా’ అని నిశ్చయించి తల్లితో ఇలా పలికాడు..
శా॥ ‘అమ్మా! మన్ను దినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెర్రినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు, కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మా ఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే’
అమ్మా! మన్ను తినడానికి నేనేమైనా చన్ను కుడిచే చిన్నవాడనా? (నాలుగు మోములున్న బ్రహ్మదేవుని కన్నతండ్రిని. మున్నెన్నడో రెండడుగులలోనే మన్ను, మిన్నులను ఒక్కుమ్మడిగా కమ్ముకొన్న వాణ్ని. ‘తెలియక తిన్నానేమో!’ అనుకుందామన్నా సర్వజ్ఞుడనైన నాకు- తెలివే (జ్ఞానమే) స్వరూపంగా ఉన్న నాకు తెలివి తప్పడమన్నది ఉంటుందా?) ఆకలి వేసిందేమో అనుకోవడానికి ఇందాకేగా పీకలదాకా పాలు తాగి వెళ్లాను. (ప్రాణమున్న జీవులకే క్షుత్తు పిపాసలు- ఆకలి దప్పులు. ‘నాహం ప్రాణః’- ‘నేను ప్రాణం కాదు. ప్రాణుల ప్రాణాలకు ప్రాణాన్ని- చైతన్యాన్ని. నాకు ఆకలి దప్పులు లేవు) లేకపోతే నేనేమైనా వెర్రివాణ్ననుకొన్నావా? (మన్ను తినడానికి నేను మూఢుడునా? నిత్య తృప్తుడనైన నాకు ఏదైనా తినాలన్న ఆశ ఉంటుందా? నా కన్నా వేరుగా ఏదీ లేదని తెలిసిన నేను మన్ను తిన్నాననడం చెల్లుతుందా?’ సర్వంకష ప్రజ్ఞ కల పరబ్రహ్మయే శ్రీ కృష్ణుడు!).
అమ్మా! వీరి మాటలు నమ్మమాక! వీరంతా అబద్ధాల కోరులు. నన్ను నీచే తన్నించాలని ఏరికోరి ఈ అబద్ధపు దారిని ఎన్నుకొన్నారు. (వేద శాస్ర్తాల అర్థం- పరమార్థం తెలియని పామరులు పలికే మాటలు నమ్మవద్దు) పోనీ, నా మీద నమ్మకం లేకపోతే, ఓ తల్లీ! నా నోరు వాసన చూసి, నే చెప్పింది కల్ల (అసత్యం) అయితే నన్ను దండించు’. తనలో శుద్ధ సత్తగుణం మాత్రమే ఉన్నందున, మున్ముందు రజో గుణాత్మకాలైన రాక్షస సంహారాది లీలలు ఎన్నో ప్రదర్శించవలసి ఉన్న కతన- కారణాన కన్నయ్య కొద్దిగా రజస్సు (దుమ్ము, రజోగుణం) గ్రహించాడని గూఢార్థం!
భగవంతుడు అమ్మకు నమ్మకం కలిగించడానికి, తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి తన నోరు వాసన చూసుకోమన్నాడు. వ్యవహారం అసలు అంతవరకు రాకనే సమసి పోతుందని భావించి వెసులుబాటు (స్వేచ్ఛ)గా అలా అన్నాడు ముసలి (బలరామ) అనుజుడు, మాయా మనుజ బాలకుడు, దనుజ మర్దనుడు జనార్దనుడు. కాని, నంద గృహిణి గంభీర స్వభావం కల వ్యక్తి, ‘అలాగైతే నోరు తెరచి చూపరా’ అన్నది ఆమె. చిక్కులో పడ్డ చక్రధరునికి నోరు తెరవక తప్పింది కాదు. దామోదరుడు ఆమోదించి తల్లికి మోదంతో తన నోరు తెరచి చూపాడు. ఆశ్చర్యం!
కం॥ ‘ఆ లలితాంగి గనుంగొనె
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్’
‘ఆ పసివాని నోటిలో యశోద పర్వతాలు, పయోనిధులు- సముద్రాలు, అరణ్యాలతో కూడిన భూగోళం, అగ్ని, సూర్యచంద్రులు, అష్ట దిక్పాలకులతో అలరే బ్రహ్మాండాన్నంతా చూచింది.’ ఆ భామిని భ్రాంతికిలోనై భయపడి మూర్ఛపోయింది. ఆమె చేతిలోని దండం జారి పడిపోయింది. స్పృహలోకి వచ్చి ఇలా అనుకున్నది..
మ॥ ‘కలయో! వైష్ణవ మాయయో! ఇతర సంకల్పార్థమో! సత్యమో!
తలపన్ నేరక యున్న దాననొ! యశోదా దేవిఁగానో! పర
స్థలమో! బాలకుడెంత యీతని ముఖస్థంబై యాజాండంబు ప్ర
జ్వలమై యుండట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపగన్’
‘నేను కలగంటున్నానా? లేక ఇది జలజాతాక్షుని (విష్ణుని) అలవి (సాధ్యం) కాని మాయాజాలమా? ఇదికాక మరేదైనా అర్థముందా? లేక ఇది సత్యమేనా? నా మతి (బుద్ధి)కి అవగతి (తెలివి) తప్పిపోయిందా? ఇంతకూ నేను యశోదనేనా? ఇది స్వగృహమా లేక పరగృహమా? కాకపోతే ఈ పిల్లవాడెంత? వీని నోటిలో బ్రహ్మాండ మెల్ల (అంతా) ఇలా వెలుగులు చిమ్మడం ఎంత వింత? చింతించే కొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పసివానిగా కనిపిస్తున్నా వీడు అసురారి- రాక్షస విరోధి. సర్వాత్మకుడైన ‘నందక’ అసి (ఖడ్గ) ధారి! విష్ణువే! ఇందులో ఎట్టి సందేహమూ లేదు. ఇది ముమ్మాటికీ నిజం!’ ఇలా నిశ్చయించుకొని యశోద తన తనయుని ముందు మోకరిల్లి, తలవంచి నమోవాకాలర్పించి. తన ఆర్తులను (దుఃఖాలను) తొలగించమని కీర్తించి అర్థించింది. ‘ఈ బాలుని ముఖం చూచి నేను, నా భర్త, గోప గోపీజనం, చివరకు ఆవులు కూడా ‘ఇతడు కాలకాలుడు, భక్తలోక పాలకుడు, మా అందరికి ప్రభువు’ అని గుర్తించక, బాలుడే అని భ్రాంతిపడి ప్రవర్తించాం కదా! ఎంత అపచారం! మా అపరాధం క్షంతవ్యమగుగాక!’
శుకుడు- రాజా! ఇలా తనను గోప బాలకునిగా కాక విశ్వపాలకునిగా భావిస్తున్న నంద భామిని యందు మరల వైష్ణవ మాయను ఆవహింపజేశాడు హలి సోదరుడు వనమాలి! యశోద విచారణ ద్వారా మాయను అధిగమించగలిగితే నా స్వరూప జ్ఞానం పొందుతుంది. అట్టి తరి బాల్య లీల ప్రదర్శన కుదరదని కృష్ణుడు తల్లికి మాతృపుత్ర (తల్లీబిడ్డల) బుద్ధిని కలిగించాడు. తాను తనయుని గాను, ఆమె తల్లి గాను తలపించి, వాత్సల్యరసంలో ముంచివేశాడని పరమార్థం! రాజా! ఆ మాయా ప్రభావం వలన నంద జాయ (పత్ని) యశోద మోహం చెంది తన కన్న- ముద్దుబిడ్డ ‘సర్వాత్ముడు’ అన్న నిజం మరచిపోయింది. కన్నయ్య తన కొడుకే అని భావించి అతనిని వడివడిగా ఒడిలో చేర్చుకొని కడు వేడుకతో ముద్దులాడింది.
శుకముని ఇలా చెప్పగా విని అవనీపతి అతి కుతూహలంతో ఇలాగని ప్రశ్నించాడు.. చతుర్దశ భువనాలకీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే జననిగా జన్మించడానికి నందగృహిణి తొలి బాము (జన్మ)లలో ఏ నోములు నోచిందో? పురుషోత్తముని పోషించే పితరునిగా పుట్టడానికి ఓ నందితాత్మా!- (మాధవ కథామృతం ఆస్వాదిస్తూ ఆనందించే మహాత్ముడవు నీవు) నందగోపుడు ఎట్టి తపస్సు చేశాడో!
కం॥ ‘ప్రబ్బిన భక్తిని హరిపైఁ
గబ్బంబులు సెప్పి కవులు కైవల్య శ్రీ
కబ్బుదురట! హరిపోషణ
మబ్బిన తలిదండ్రులెచటి కబ్బుదురొ తుదిన్’
యోగీంద్రా! కవీంద్రులు ఎంతో భక్తితో అతీంద్రియుడు, ఉపేంద్రుడు శ్రీహరిపై కావ్యాలు రచించి మోక్షలక్ష్మీ కటాక్షానికి పాత్రులు అవుతారట! మరి కేశవుని కనిపెంచి పోషించే భాగ్యానికి నోచుకున్న జననీజనకులు ఏ లోకంలో పాగా వేస్తారో కదా!
పిండితార్థం… తాను కాని మన్నులేదు, తినడమనే క్రియ లేదు. కాన, కన్నయ్య మన్ను తినలేదన్నా నిజమని తేలింది! ‘మాకు ఈ అర్థాలు పరమార్థాలు ఎందుకండీ? నందనందనుడే చాలు’ అన్నారు గోకులవాసులు!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006