తిరుమల: ఏడు కొండలపై కొలువైఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం కొనసాగుతున్నది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏడాది జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఆలయంలో గత మంగళవారం నుంచి మూడురోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నారు. చివరి, మూడో రోజైన నేడు స్వామి వారు స్వర్ణకవచంలో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత స్వామివారిని ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే యేడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో నేడు వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. తరతరాలుగా చేస్తున్న అభిషేకాలతో.. అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఏటా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు.