పూజ సమయంలో పసుపు, కుంకుమ చేయిజారి నేలపై పడితే అది పొరపాటుగా జరిగిన పని. అంతే. అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు. ఏ వస్తువు చేజారినా ఆ వస్తువు నేలపాలు అవుతుంది. పసుపు కుంకుమలైనా అంతే. అది దేనికో సంకేతం అనుకోవటం శాస్త్రీయం కాదు. సాధారణంగా ఐదోతనానికి ‘పసుపుకుంకుమల’ను ప్రతీకగా భావిస్తారు.
ఈ కారణంగా అవి చేజారితే అరిష్టమని నమ్మకం ప్రచారంలోకి వచ్చింది. పసుపు, కుంకుమలు చేజారి నేలపై పడటం అరిష్టం కాదు. తిరుమల, విజయవాడ, యాదగిరిగుట్ట తదితర క్షేత్రాల్లో పసుపు, కుంకుమలతో మెట్లను పూజించడం చూస్తుంటాం. దానిని పుణ్యకార్యంగానూ భావిస్తాం. అలాంటప్పుడు పసుపు కుంకుమలు పొరపాటుగా చేజారితే అసంకల్పితంగా భూదేవికి అర్చన చేశామని భావించాలి. అంతేగానీ, అనవసరంగా కలవరపడటం సరికాదు.
-రాధిక, కరీంనగర్