ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు?
తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కొడుకుకు సంవత్సర సూతకం ఉంటుంది. ఈ కాలంలో క్షేత్ర సందర్శనం, ఇతర శుభకార్యాలు చేయరాదని శాస్త్ర నియమం. కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు రోజులపాటు అశౌచం (మైల) పాటించాలి. ఈ పన్నెండు రోజులు చనిపోయిన వ్యక్తి పేరుమీద సంతాప దినాలు పాటించాలి. పన్నెండో రోజు మైల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంట్లోని వ్యక్తి పోయిన బాధ నుంచి తేరుకోవడం కోసం, దుఃఖం నుంచి ఒడ్డున వేయవలసిందిగా ధ్యానించడం కోసం ఏదైనా గుడికి వెళ్లి నిద్ర చేయడమనేది సంప్రదాయం.
పుట్టెడు దుఃఖంలో కొందరికి వైరాగ్య భావనలు కలుగుతాయి, మరికొందరు మనస్తాపంతో విపరీత నిర్ణయాలు తీసుకునే ప్రమాదమూ ఉంటుంది. వారికి దైవం అండగా ఉంటాడన్న భరోసా కల్పించడానికి ఆలయంలో నిద్ర చేయమని సూచించారు. ఇలా చేయడం వల్ల మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ తర్వాత తమతమ ఆప్తుల ఇండ్లకు నిద్రకు వెళ్లినా ఇలాంటి ఓదార్పు కోసమే.
– విశ్వనాథ్, కామారెడ్డి