కాలం ఎప్పుడూ కత్తులు పట్టిన విజేతల పక్షమే నిలబడుతుందని లోకం అనుకుంటుంది. సామ్రాజ్యాల విస్తరణ, కిరీటాల ఆక్రమణ, శత్రువుల లొంగుబాటు.. వీటినే చరిత్ర గెలుపునకు కొలమానాలుగా చూపిస్తుంది. కానీ, భౌతిక జగత్తులోని ఈ లౌకిక సూత్రాలను తిరగరాస్తూ, ఓటమిలోనే అమర విజయాన్ని సాధించిన మహోన్నత ఘట్టం ఒకటి చరిత్ర పుటల్లో రక్తాక్షరాలతో లిఖించి ఉంది. అదే.. ముహర్రం మాసంలో, ఇరాక్ దేశపు తపించే ఎడారి ఇసుక తిన్నెలపై జరిగిన ‘కర్బలా’ మహాసంగ్రామం. ఇది కేవలం ఒక మతానికో, వర్గానికో పరిమితమైన సంఘటన కాదు.
నైతికతకు, అధర్మానికి మధ్య జరిగిన అంతర్ సంఘర్షణ. ప్రవక్త ముహమ్మద్ ప్రియతమ మనుమడు ఇమామ్ హుసైన్ ఇబ్న్ అలీ (రజి) తన ఆత్మసమర్పణతో మానవాళికి అందించిన సత్య సందేశమిది. కర్బలా అనేది ఎప్పుడో 7వ శతాబ్దంలో జరిగిపోయిన ఒక చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు. అది నేటి ఆధునిక కాలంలో ప్రతి మనిషి అంతరంగంలో నిత్యం జరిగే సంఘర్షణకు దర్పణం. బాహుళ్యం ముఖ్యం కాదు, సత్యం ముఖ్యం: నైతికత లేని వేలాది మంది సైన్యం కంటే, సత్యం వైపు నిలబడిన 72 మంది చిన్న సమూహమే కాలపరీక్షలో గెలిచింది.
హుసైన్ దగ్గర ఏమీ లేదు. కానీ, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలలో ఆయన పేరు ఎంతో నిలిచిపోయింది. మన నిత్య జీవితంలో అవినీతికి లొంగిపోవాలని ఒత్తిడి వచ్చినప్పుడు, తోటి మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు స్వార్థంతో మౌనంగా ఉండాలనిపించినప్పుడు.. మనం కర్బలా కూడలిలోనే నిలబడతాం. లౌకిక ప్రపంచంలో తాత్కాలిక లాభాల కోసం నైతిక విలువలను అమ్ముకోకుండా, అంతరంగంలోని సత్యానికి కట్టుబడి జీవించడమే నిజమైన విజయం అని కర్బలా నిరూపించింది. కర్బలా మట్టిలో హుసైన్ ఒరిగిపోయి ఉండవచ్చు, కానీ మానవాళి ఎల్లప్పుడూ తల ఎత్తుకుని ఎలా జీవించాలో నేర్పి అమరజీవిగా నిలిచిపోయారు.
-ముహమ్మద్ ముజాహిద్ ,96406 22076