శ్రీశైలం : కార్తీకమాసం ముగియనున్న నేపథ్యంలో గురువారం శ్రీశైల క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున పుష్కరిణి, కృష్ణానదిలో స్నానాలు చేసి స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం బార్లు తీరారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలతోపాటు వివిధ ఆర్జిత సేవల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లన్న గర్భాలయ దర్శనాలకు అనుమతించడంతో విడతలవారీగా వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల కోసం యాత్రికులు పోటీ పడ్డారు. అదే విధంగా ఉచిత, శీఘ్ర దర్శన టిక్కెట్లు తీసుకున్నవారికి సుమారు మూడు గంటలకుపైగా దర్శనానికి సమయం పట్టింది.
ఉచిత క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లలో మంచినీరు, మూత్రశాలలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి కలిగిన సామాన్య భక్తులకు కనీస వసతుల కల్పించాలని భక్తులు కోరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 30వేలకుపైగా భక్తులు తరలివచి భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. సాయంత్రం దక్షిణ మాడవీధిలో కళారాధన కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.