శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాల సందడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. కాలినడక భక్తులకు అడుగడుగునా అన్నదానాలు.. మజ్జిగ పండ్లు పంపిణీ చేస్తూ అటవీ ప్రాంతంతో సహా హఠకేశ్వరం నుంచి క్షేత్ర ప్రధాన వీధి వరకు స్వచ్ఛంద సేవా సంఘాల కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. మరో రెండు రోజులు మాత్రమే గర్భాలయ స్పర్శదర్శనానికి అనుమతించనున్నందున స్వామివారి దర్శనానికి సుమారు 10 గంటలకుపైగా పడుతున్నది.
శీఘ్ర దర్శనం కోసం రూ.500 టికెట్లు అందుబాటులో ఉండకపోవడం.. కంకణధారణ భక్తులు కూడా అధిక సంఖ్యలో క్యూలైన్ల వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కంపార్ట్మెంట్లు క్యూలైన్లలో అరకొర వసతులతో గంటల తరబడి వేచి ఉండలేక యాత్రికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఉత్సవాలకు ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తుండడంతో అదుపు చెయ్యడం కష్టసాధ్యమవుతుందని ఆలయ సిబ్బంది వాపోయారు. ప్రతి రోజు సుమారు 70వేల మందికిపైగా వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి చేరుకుంటున్నారని అధికారుల అంచనా. క్షేత్ర పరిధిలో వివిధవ భాషల్లో మరిన్ని సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని యాత్రికులు కోరుతున్నారు.
దేవస్థానానికి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న కోరారు. ఉత్సవాలకు వచ్చే రద్దీ దృష్ట్యా పూర్తి ఏర్పాట్లు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాలినడక భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి స్పర్శ దర్శనాలు కల్పిస్తున్నందున స్వల్ప ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అదే విధంగా క్షేత్ర పురవీధుల్లోకి సొంత వాహనాలతో వస్తుండడంతో తిప్పలు ఎదురవుతున్నాయని, అలాగే ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయన్నారు. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులు సంయమనం పాటించాలని కోరారు. దేవస్థానం దాతల సహాయంతో అందించే అల్పాహారాలు, పాలు, మజ్జిగ అందుబాటులో అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.