వేములవాడ కల్చరల్ : రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. వేకువజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి, స్వామివారికి ప్రీతికరమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు కల్యాణాలు, చండీహోమం, సత్యనారాయణవ్రతాల్లో పాల్గొన్నారు.
వివిధ ఆర్జితసేవల ద్వారా ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.22 లక్షల ఆదాయం సమకూరిందని, స్వామివారిని 40వేల మందికిపైగా భక్తులు తరలించకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలో భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఈవో రమాదేవి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ టీఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు, శ్రీకాంత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.