ఒకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. అతనికి నిర్వాణం (ముక్తి) పొందాలని, ఆ పారవశ్యంలో మునిగితేలాలన్న ఆకాంక్ష ఉండేది. అతను చాలామంది దగ్గరికి వెళ్లి, ‘నిర్వాణానికి మార్గం అంటే ఏమిటి?’ అని అడిగేవాడు. ఈ ప్రశ్న విన్న ప్రతి ఒక్కరూ అతనితో ‘ప్రతి మార్గమూ బుద్ధుని ప్రదేశానికి తీసుకువెళ్తాయి. కానీ, ఒక మార్గం మాత్రం సరాసరి నిర్వాణ ద్వారానికి దారితీస్తుంది. కానీ, ఆ మార్గం గురించి ఒకే ఒక ధ్యాన గురువుకు తెలుసు. ఆయన దగ్గరకి వెళ్లు. నీకు మార్గదర్శనం అవుతుంది’ అన్నారు. ఆయన ఉండే మఠానికి చేరుకొని, గురువు ముందు మోకరిల్లాడు ఆ యువకుడు. ఎంతో వినమ్రతతో ‘ఓ గురుదేవా! నన్ను నేను మీ పాదాల వద్ద సమర్పించుకున్నాను. దయచేసి దారి చూపండి’ అన్నాడు.
‘అది ఆ ప్రహరీ గోడకు అవతలే ఉంది’ అన్నాడు గురువు. శిష్యుడు అమితాశ్చర్యంతో బహుశా గురువు గారికి తన ప్రశ్న సరిగా అర్థం కాలేదేమో అనుకున్నాడు. ‘గురుదేవా! నేను ప్రహరీ గోడకు అవతల ఉన్న మార్గం గురించి కాదు అడిగింది, నేను కోరేది అంతిమ మార్గం’ అన్నాడు. ‘ఓ! ఆ దారి రాజధానికి పోతుంది. నీకు తెలియదా’ అన్నాడు గురువు. ‘అది కాదు గురుదేవా! ఎవరిని అడిగినా అన్ని మార్గాలు బుద్ధుడి ప్రదేశానికి తీసుకుపోతాయని, కానీ ఒక్కదారి మాత్రం సరాసరి నిర్వాణ ద్వారానికి తీసుకుపోతుందనీ, మీరు ఆ మార్గం గురించి బాగా తెలిసినవారనీ చెప్పారు! ఆ మార్గం ఎక్కడుందో చెప్పగలరు’ అన్నాడు. దానికి గురువు చిన్నగా నవ్వుతూ ‘ఓ! ఆ మార్గమా అది ఇక్కడే ఉంది’ అని శిష్యుడు నిల్చొని ఉన్న ప్రదేశాన్ని చూపించారు గురువు.
మీరు నిర్వాణాన్ని చేరాలన్నా, ముంబై చేరాలన్నా, ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాలి? మీరిప్పుడు ఎక్కడున్నారో అక్కడినించే కదా! ముక్తికి మార్గం మరెక్కడి నుంచో ప్రారంభమవుతుందని మీరు ఊహించుకుంటే మీరు ఆ ఊహా లోకంలోనే తప్పిపోతారు. ఏ రకమైన ప్రయాణమైనా, మనమెక్కడున్నామో అక్కడి నుంచే ప్రారంభించగలం. ఇప్పుడు ఉన్నచోటు నుంచి కదలకుండా ముక్తి కోసం అడిగితే ఎప్పటికీ దాన్ని చేరుకోలేం! మనం ఎక్కడ నిల్చున్నామో చూసుకోకుండా, అవతలి వీధి నుంచి ప్రయాణం ప్రారంభించాలని చూస్తే, అది జరగని పని. కాబట్టి, ఉన్న చోటు నుంచి తర్వాత అడుగు వేస్తేనే, ఆపై మరో అడుగు, ఇంకో అడుగు ఇలా ప్రయాణం సాగుతుంది.
…? సద్గురు, ఈశా ఫౌండేషన్