నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటం ఇంట్లో ఉండకూడదంటారు నిజమేనా?
– జె. జ్ఞానప్రసూన, హైదరాబాద్
సకల సంపదల స్వరూపిణి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది సముద్రంలోనే అయినా, నిరంతరం కమలాసనిగా దర్శనమిస్తుంది. ధనం, శాంతి, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీకగా లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటాం. ఆది, ధాన్య, ధైర్య, గజ, సంతాన, విజయ, విద్యా, ధనలక్ష్మి అనే ఎనిమిది రూపాలలో అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలని భక్తులు ఆకాంక్షిస్తారు. నిత్యం లక్ష్మీదేవి విగ్రహానికో, పటానికో పూజలు చేస్తుంటారు.
మనం పూజించే లక్ష్మీదేవి రూపం యౌవనంతో ఉండి, దళసరి చిబుకంతో, ఎర్రని పెదాలతో, చక్కని కనుబొమలతో, గుండ్రని ముఖంతో ఉండాలి. దివ్య వస్ర్తాభరణాలతో ఒప్పుతుండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వ ఫలాలతో పద్మాసంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి రూపాన్ని పూజించాలని మత్స్య పురాణం చెబుతున్నది. కూర్చొని ఉండటం స్థిరత్వానికి ప్రతీక. నిలబడి ఉండటం చంచలత్వానికి సంకేతం.
సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలని అందరూ భావిస్తారు. కాబట్టి, కూర్చున్న అమ్మవారి చిత్రపటం పూజించాలనే సంప్రదాయం ఏర్పడింది. అయితే, నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటం ఇంట్లో ఉండటం దోషం కాదు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370