అత్తాపూర్ : సమాజంలో కుల, మత, లింగ వివక్ష బేదాలను సమూలంగా వ్యతిరేకించిన మహనీయుడు బసవేశ్వరుడు అని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం అయన అత్తాపూర్ బసవేశ్వర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శరణమేళా ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్బంగా బసవేశ్వరుడి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు వక్తలు బసవేశ్వరుడి చరిత్ర ఆయన ప్రవచనాలను వినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ… చిన్న వయస్సులోనే శైవపురాణ గాథలను అవగతం చేసుకున్నమహనీయుడు బసవేశ్వరుడు అన్నారు.
మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పిన వ్యక్తి బసవేశ్వరుడు అని అందరూ అతని బోధనలను పాటించాలన్నారు. బసవేశ్వరుడు బోధించిన సాంప్రదాయమే నేటికి కొనసాగుతుందని ఆయన బోధనలను పరిగణలోకి తీసుకుని పాలన సాగుతుందన్నారు.
రాష్ట ప్రభుత్వం కూడా లింగాయత్ల ప్రత్యేక భవనం కోసం భూమిని కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లింగాయత్ల కోసం కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమానికి హాజరైన భక్తుల కోసం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతాశ్రీ గంగామాత, బసవసంఘం రాష్ట అధ్యక్షుడు శంకరప్ప, కార్పొరేటర్ సంగీత తదితరలు పాల్గొన్నారు.