TTD news | తిరుపతి శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగానం, తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేపట్టారు. దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఉదయం శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు శ్రీవేణుగోపాలస్వామి దర్శనం, ప్రసాదం పంపిణీ చేశారు . సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు అథితులు బహుమతులు పంపిణీ చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓ శ్రీమతి సదా భార్గవి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, టీటీడీ గో సంరక్షణ ట్రస్టు సభ్యులు రామ్ సునీల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.