TTD news | తిరుమలలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు గోదాదేవి కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో ఆదివారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిపారు. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆ తర్వాత మహా సంకల్పం, స్వామి, అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించి గోదా కల్యాణం విశిష్టతను వివరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు సంకీర్తనలు వీనుల విందుగా ఆలపించారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవింద గోవిందయని కొలువరే సంకీర్తన ఆలపించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజు కనుమ పండుగ నాడు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గోదాపరిణయోత్సవాన్ని విశేషంగా జరిపారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్ద జీయ్యర్ స్వామి మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ఆనంతరం శ్రీ మలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామి పార్వేట మండపానికి వేంచేపు చేసి ఆస్థానం, పార్వేట కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీమలయప్ప స్వామి తిరుమలనంబి ఆలయానికి వేంచేపు చేస్తారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.