శ్రీశైలం : శ్రీగిరులపై మహా శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు సాయంత్రం స్వామివారి భ్రమరాంబ అమ్మవారితో కలిసి గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమాలు నిర్వహించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం ప్రత్యేకంగా అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మంగళ వాయిదాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.
గంగాధర మండపం నుంచి నంది మండపం, అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగగా.. భక్తులు నీరాజనం పట్టారు. శోభాయాత్రలో చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, శేషధారణలు, గొరవనృత్యం, నందికోలసేవ తదితర విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవం అనంతరం కాళరాత్రి పూజ, మంత్రపుష్పంతో పాటు ఆస్థాన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఈఈ మురళీ, అసిస్టెంట్ నటరాజ్, ఏఈవోలు ఫణీదర్ ప్రసాద్, పిఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
శివరాత్రి బ్రహ్మోత్పవాల్లో మార్చి 2న రథోత్సవం జరుగనున్నది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం రథోత్సవ కలశానికి మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి, అనంతరం రథ శిఖరానికి అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఉత్సవాల సందర్భంగా భ్రామరి కళావేదిక, పుష్కరణి, శివదీక్షా శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. కూచుపూడి, భరతనాట్యం, కథక్ హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివరాత్రి రోజున నందివాహన, సేవ జరుగనున్నది. లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు స్వామి అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నారు.
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకే చోట వెలసిని మహిమాన్విత క్షేత్రం శ్రీశైలమని జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధ రామశివాచార్య మహాస్వామి అన్నారు. సోమవారం ఉదయం క్షేత్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో లవన్న, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఉభయ దేవాలయాలతో పాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో శ్రీశైలం జనసంద్రంగా మారింది. మహా శివరాత్రి రోజున ఆది దంపతులను దర్శించకునేందుకు వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు. దాదాపు లక్షకుపైగా భక్తులు క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.