భారత దేశ జీవనవాహిని గంగానది. ప్రేమగా గంగ అని పిలుచుకుంటారు. గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరించుకుంటున్నది. స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ శుక్ల పాడ్యమి తేది 21-4-2023 శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా రా.తె. 5-09 గంటలకు దేవ గురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఈ క్రమంలో ఏప్రిల్ 22 నుంచి సార్ధ త్రికోటి సహిత గంగానది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పన్నెండు రోజులు కొనసాగి మే 3వ తేదీతో ముగియనున్నాయి. పుష్కరాల సమయంలో పితృదేవతల ప్రీత్యర్థం స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేయడం పుణ్యప్రదం.