Eid Ul Fitr | ఒక మొక్క నాటారు. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజూ నీళ్లు పోశారు. రాత్రుళ్లు సైతం దాని బాగోగులు చూశారు. దానిపట్ల ఎంతో శ్రద్ధ చూపారు. అది కాస్తా పెరిగి పెద్దదవుతున్న తరుణంలో పట్టించుకోవడం మానేశారు. చివరాఖరికి అది వాడిపోయింది. ఫలితం శూన్యం. మొక్క పెరిగి పూలు పూసి, కాయలు కాసేవరకూ దాని బాగోగులు చూసినవారే ఫలాలను అనుభవించగలుగుతారు. వారే నిజమైన వివేకవంతులు.
మొక్క, పూలు, పండ్లు ఏమిటనుకుంటున్నారా? రమజాన్ వసంతంలో చేసిన ఆరాధనలు, రోజాలు, ఆచరించిన సత్క్రియలన్నీ మనం పెంచే మొక్కల్లాంటివే. ఈ నెలలో అల్లాహ్ ఇచ్చిన శిక్షణను మిగతా 11 నెలలూ ఆచరణలో పెట్టినప్పుడే వాటి ఫలాలు అనుభవించగలుగుతాం. రమజాన్ ప్రయాణం ముగింపు కాదు, ఉన్నతమైన ఆరంభం. ‘చాలామంది రమజాన్ వెళ్లిపోయింది కదా’ అని తమ పాత జీవితాన్ని అలవర్చుకుంటారు. మనలో మార్పు తీసుకురాని రమజాన్ శిక్షణ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అన్నది ప్రవక్త బోధనల సారాంశం. విశ్వాసులు రమజాన్ తరువాత వచ్చే 11 నెలలూ అల్లాహ్ వైపునకు మరలాలన్నదే ఖురాన్ ఉద్బోధ.
రమజాన్ మాసంలో రహ్మత్ (కారుణ్యం), బర్కత్ (శుభాలు), సహెరీ, ఇఫ్తార్ల సంతోషాలు, రోజాలు, ఖురాన్ పారాయణంతో అల్లాహ్తో సంభాషణలు, షబేఖదర్ శుభాలతో ముస్లింలు తడిసిముద్దవుతారు. విశ్వాసులు ఆచరించిన పుణ్యకార్యాల ఫలాన్ని ప్రసాదించేందుకు, తెలిసీ తెలియక చేసిన తప్పిదాలను మన్నింపచేసేందుకు రమజాన్ అతిథి సిఫారసు కోసం అల్లాహ్ దగ్గరికి తిరిగి వెళ్లిపోయింది. తఖ్వా (దైవభీతి), దైవారాధనలు, ఖురాన్ పారాయణాలు, రోజాలో ఉంటూ ఆకలి దప్పులను సహించడమెలాగో, మనసుపై అదుపు సాధించడమెలానో నేర్పి వెళ్లింది ఈ మాసం. కటిక పేదల ఆకలి బాధను అనుభవపూర్వకంగా తెలిపింది. 30 రోజుల్లో తన బాధ్యతను నెరవేర్చి వెళ్లిపోయింది. ఈ నెల అందించిన ఆకలి అనుభూతులు పేదవారి ఆకలి తీర్చాలన్న పాఠాన్ని నేర్పుతాయి. ఈ మాసంలో చేసిన ఖురాన్ పారాయణాలు నిత్యం గుర్తుంచుకోవాలి. రమజాన్ అలవర్చిన సహనం, సానుభూతులను ఏడాదంతా కొనసాగించాలి. ‘ఈ రమజాన్ అతిథి రోజేదార్ల కోసం అల్లాహ్ ముందు సిఫారసు చేస్తుంది’ అని అంటారు ప్రవక్త ముహమ్మద్ (స). ‘ఓ అల్లాహ్ ఫలానా వ్యక్తి రోజాలో ఉంటూ అన్నపానీయాలను త్యజించాడు. రోజంతా పస్తుండి, చెడుపనులకు దూరంగా ఉన్నాడు. రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి తరావీ నమాజులో నిల్చున్నాడు. ఇతణ్ని మన్నించి స్వర్గాన్ని ప్రసాదించు’ అని సిఫారసు చేస్తుంది. సిఫారసు చెల్లుబాటు కావాలంటే నెలరోజుల శిక్షణను రమజాన్ పండుగ మరుసటి రోజు నుంచే ఆచరణకు నాంది పలకాలి.
రమజాన్ నెలసాంతం ఉపవాసాలు పాటించే శక్తిని ప్రసాదించినందుకు గాను, ఫిత్రా దానం ద్వారా పేదలను ఆదుకున్నందుకు గాను కృతజ్ఞతను చాటిచెబుతూ, అల్లాహ్ గొప్పతనాన్ని చాటేందుకు ఈదుల్ ఫిత్ర్ పండుగను జరుపుకొంటారు. షవ్వాల్ నెలవంక సంకేతంగా ఈ పండుగను చేసుకుంటారు. ఫిత్రా దానాలు చేస్తారు కాబట్టి ఈ పండుగకు ఈదుల్ ఫిత్ర్ అనే పేరు వచ్చింది. పండుగ నమాజు కంటే ముందే ఈ దానాలు చేయాల్సి ఉంటుంది. పండుగ నమాజు ముగిశాక చేసే దానాలు అల్లాహ్ స్వీకృతి పొందవు. నెల రోజులపాటు ఉపవాసాలలో ఎన్నో లోటుపాట్లు జరిగి ఉంటాయి. ఆ తప్పుల పరిహారానికి ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానం చేయాలన్నది ప్రవక్త ఆదేశం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర లెక్కగట్టి పేదలకు ఈ దానం చేయాలి. అప్పుడే పుట్టిన శిశువు పేరు మీద కూడా ఈ దానం చేయాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తి పేర రూ.70 నుంచి రూ.500ల వరకూ లెక్కగట్టి పంచుతారు. ఇలా ఆదుకోవడం వల్ల నిరుపేదలకూ పండుగ సంతోషాలను అందించినట్లవుతుందని ప్రవక్త (స) సూచన.
పండుగ నమాజుకు ఇంటినుంచి బయలుదేరేముందు ఖర్జూరం గానీ, ఇతర తీపి పదార్థాన్ని తిని ఈద్గాహ్కు నమాజు కోసం బయలుదేరేవారు ప్రవక్త. ఆ సంప్రదాయంతోనే షీర్ ఖుర్మా పాయసాన్ని తయారుచేస్తారు. తక్బీర్ వచనాలు ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్’ పలుకుతూ ఈద్గాహ్కు బయలుదేరేవారు. నమాజు తరువాత తమ బంధుమిత్రులందరినీ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపేవారు. సంతోష ఘడియల్లో ఒకరినొకరు పరస్పరం కలుసుకుని మానవత్వమంటే ఏమిటో తెలిపేవారు. ఒకరి సంతోషాల్లో ఒకరు పాలుపంచుకోవడం వల్ల ఒత్తిడి, కుంగుబాటును జయించవచ్చు అన్నది పండుగ సంతోషాల ద్వారా తెలుస్తుంది. రమజాన్ మాసంలో ప్రతి ఘడియా సంతోషం కోసమే వచ్చింది. మన కర్మల పట్ల అల్లాహ్ ప్రసన్నత దక్కితే అంతకుమించిన మహా సంతోషం ఇంకేముంటుంది? రమజాన్ వసంతం ఇదే సందేశాన్ని ఇస్తుంది.
… ముహమ్మద్ ముజాహిద్, 9640622076