పద్మే చ తత్రైవ ద్వాదశేశ్వపి
మాసేశు కార్తికః కృష్ణ వల్లభః
తస్మిన్ సంపూజితో విష్ణురల్పకైరపి ఉపాయనైః
దదాతి వైష్ణవం లోకమితి ఏవం నిశ్చితం మయా
॥ (పద్మ పురాణం)
‘పన్నెండు నెలల్లో కార్తికం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో స్వల్పమాత్రమైనా విష్ణువును ఆరాధించిన వారికి కార్తిక మాసం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది’ అని పై శ్లోకానికి అర్థం. కార్తికంలో శ్రీకృష్ణుడి కోసం చేసే ఎంత అల్పమైన సేవ అయినా పరమానందాన్ని అనుగ్రహిస్తుంది అనడంలో సందేహం లేదు. భక్తులంతా ఆనందోత్సాహాలతో వేడుకలు చేస్తూ స్వామిని సేవించడానికి కార్తిక మాసం అనేక ఉత్సవాలను తీసుకువస్తుంది.
కార్తిక దీపోత్సవం
నందనందనుడి అద్భుత లీలల్లో కార్తిక మాసంలో ప్రదర్శించిన దామోదరలీల ఒకటి. శ్రీకృష్ణుడికి ‘దామోదరుడు’ అనే పేరు ఎలా వచ్చిందో హరివంశంలో కనిపిస్తుంది.
స చ తేనైవ నామ్నా తు కృష్ణో వై
దామ బంధనాత్
గోష్టే దామోదర ఇతి
గోపీభిః పరిగీయతే॥
సంస్కృతంలో దామం అంటే ‘తాడు’, ఉదర అంటే ‘పొట్ట’ అని అర్థం. కొంటెచేష్టలు చేస్తున్న చిన్నికృష్ణుడి పొట్టను తల్లి యశోదమ్మ తాడుతో చుట్టి రోకలికి కట్టివేసిన లీల ఆధారంగా ఆయనకు ఏర్పడిన నామమే దామోదరుడు. శ్రీకృష్ణుడు ఏ విధంగా భక్తవశుడు, భక్త పరాధీనుడన్న విషయాన్ని దామోదర లీల విశదపరుస్తుంది. పవిత్ర కార్తిక మాసంలో ‘దామోదర’ వ్రతం ఆచరించాలని అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యుడు శ్రీల ప్రభుపాదులు సూచించారు. ఈ వ్రతంలో శ్రీకృష్ణుడిని దామోదర అష్టకంతో కీర్తిస్తూ నేతి దీపాన్ని సమర్పించాలి. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరే హరే’ నామ మంత్రాన్ని జపిస్తూ కూడా దీపాన్ని సమర్పించవచ్చు. కార్తిక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడు అవుతాడు. తోటి భక్తులు దీపాన్ని సమర్పించేందుకు వీలుగా వారి దీపాన్ని వెలిగించిన వారినీ స్వామి అనుగ్రహిస్తాడని పద్మ పురాణం చెబుతున్నది.
గోవర్ధన పూజ
కార్తిక మాసంలోనే శ్రీకృష్ణుడు చూపిన గోవర్ధన లీల మరో అపురూప ఘట్టం. దీనిని అన్నకూట మహోత్సవమని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడి విశుద్ధ భక్తులైన బృందావన ప్రజలు తనను పూజించలేదని దేవేంద్రుడు ఆగ్రహిస్తాడు. ఏకధారగా వర్షాలు కురిపిస్తాడు. ఆ సమయంలో గోపాలుడు తన ఎడమచేతి చిటికెన వేలితో గోవర్ధన గిరిని పైకెత్తి బృందావనవాసులకు, గోవులకు, జంతువులకు ఆశ్రయం కల్పించి సంరక్షిస్తాడు. ఆనాటి నుంచి గోవిందుడిని గోవర్ధన గిరిధారిగా కీర్తించారు భక్తులు. ఈ అద్భుతలీలను స్మరించుకుంటూ కార్తిక మాసంలో వివిధ తినుబండారాలతో గోవర్ధన గిరి ఆకృతిని నిర్మించి, శ్రీకృష్ణుడికి నివేదించి దానిని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు.
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజీ
93969 56984