దీపావళి సందర్భంగా నిర్వహించే కేదారేశ్వర వ్రతం ప్రాధాన్యాన్ని తెలియజేయండి?
-జె. జనార్దన్ యాదవ్, నిజామాబాద్
కేదారమంటే ‘వరిమడి’ అని అర్థం. వరి పంట చేతికొచ్చే సమయంలో రైతులు ఆ ధాన్యాన్ని ప్రసాదించే గౌరీకేదారేశ్వరుల అనుగ్రహాన్ని పొందడానికి చేసుకునే వ్రతాన్నే కేదారేశ్వర వ్రతం అంటారు. వాస్తవానికి ఈ వ్రతం ‘అనఘాష్టమీ వ్రతం’ పేరుతో భాద్రపద శుద్ధ అష్టమి నాడే ప్రారంభమవుతుంది. ఎనిమిది రూపాలలో దర్శనమిచ్చే లక్ష్మీదేవిని త్రిపురసుందరిగా, శ్రీమన్నారాయణుడిని త్రిమూర్తి స్వరూపునిగానూ ఆవాహనం చేసి పూజించి ఆశ్వయుజ అమావాస్య (దీపావళి) నాటి కేదారేశ్వర వ్రతంతో దీనిని ముగిస్తారు.
ఆ రోజున ఇంటిల్లిపాది ఉపవాసం పాటించి కేదారేశ్వరుడిని ధ్యానిస్తారు. వ్రతం పూర్తయ్యాక నక్షత్ర దర్శనం చేసుకొని, స్వామికి నివేదించిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్లే పార్వతీదేవికి శివుడు భర్తగా లభించాడని పురాణ కథ. కేదారేశ్వర వ్రతంలో పాల్గొన్న భక్తులకు సకల ఐశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం.
భృంగి అనే గణనాథుడు మోక్షాన్ని కోరుతూ పార్వతీదేవిని కాదని పరమశివుణ్ని మాత్రమే పూజించాడట. దానిని పార్వతీదేవి అవమానంగా భావించింది. కేదార క్షేత్రంలో ఉన్న గౌతమ మహర్షికి తన బాధను చెప్పుకొన్నది. దానికి పరిష్కారంగా ఆ మహర్షి ఉపదేశంతో అదే ఆశ్రమంలో కేదారేశ్వరుడైన పరమశివుణ్ని ఉపాసించింది. దీపావళి అమావాస్య నాటికి వ్రతం పూర్తిచేసిన పార్వతీదేవి.. అర్ధనారీశ్వరిగా శివుడిలో సగభాగం పొందిందని స్కాంద పురాణ కథ. ఈ వ్రతం ఆచరించిన దంపతులు సత్సంతానాన్ని పొందుతారని పెద్దల మాట.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370