తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
సుమతి శతకంలోని ఈ పద్యాన్ని చాలామంది చిన్నప్పుడే విని ఉంటారు. అందరికీ తెలిసిన పద్యం ఇది. తాత్పర్యం అర్థమయ్యే రీతిలోనే ఉంది కాబట్టి, ప్రత్యేకంగా అర్థం చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే, ఈ అర్థం ఎవరికి అన్వయం అవుతుంది? అని ప్రశ్నిస్తే.. పద్య సారాంశం అందరికీ అన్వయం అవుతుంది. ఇందులో సూచించిన నియమాలు అందరూ పాటించాల్సినవి. ఆ మాటకొస్తే దేవతలు ఈ సూచనలు పాటించిన ఉదంతాలు పురాణ, ఇతిహాసాల్లో మనకు కనిపిస్తాయి.
రామాయణం ప్రకారం సీతను రావణాసురుడు అపహరించుకుపోయిన తర్వాత రాముడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆందోళన పడ్డాడు. చెట్టును, పుట్టను, నీటిని, కొండను, కోనలను అన్నింటిని సీత జాడగురించి అడిగాడు. సీతను ఎటువైపు తీసుకువెళ్లాడో చెప్పమని అర్థించాడు. సమాధానం రాకపోవడంతో నిరాశపడ్డాడు. రామునికి సీతపై ఉన్న ప్రేమకు ఇది తార్కాణం. నిరాశలోంచి రాముడిలో ఆవేశం పెరిగింది. తన సీత గురించి సమాధానం ఇవ్వని ప్రకృతిని నాశనం చేస్తానని బాణం ఎక్కుపెట్టాడు. మొదటిసారి రాముడిలో ఆవేశం చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు, ఆందోళన చెందాడు. అన్నను వారించాడు. అందరు కోదండ రాముడిని చూశారు గానీ, దండించాలనుకునే రాముడిని ఎప్పుడూ చూడలేదు. ధర్మానికి ప్రతీక అయిన రాముడేనా ఇలా మాట్లాడుతున్నది?! చీమకైనా అపకారం తలపెట్టని కరుణాసాగరుడైన రాఘవుడేనా ప్రకృతిని నాశనం చేయాలనుకునేది?! నీతికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనమైన శ్రీరామచంద్రుడిని చూసిన ప్రజలు, ఆవేశపూరితుడైన రాముడిని చూడగలరా?! సీతమ్మ తల్లి జాడ గురించి సమాచారం ఇవ్వలేదనే ప్రకృతిపై ఆవేశమా? ‘అన్నా! సీతమ్మ తల్లిపై మీకున్న ప్రేమే ఈ ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇప్పటివరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా మాకు రామయ్య ఉన్నాడు. ఆయనకు చెప్పుకొంటే మాకు రక్షణ దొరుకుతుందనే ధైర్యంతో ఉన్నారు. మరిప్పుడు ప్రజలను, ప్రకృతిని ఎవరు ఆదుకుంటారు? సకల గుణాభిరాముడు, ధర్మనిరతుడైన రాముడే అధర్మంగా ప్రవర్తిస్తే ఈ లోకం తట్టుకుంటుందా? ఇక ధర్మానికి తావుంటుందా? ఆ రాక్షసుడు సీతమ్మ తల్లిని ఆకాశమార్గాన తీసుకువెళ్లి ఉంటాడు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియకపోవచ్చు. తెలిస్తే తప్పక సమాచారం లభించేది. రామచంద్ర ప్రభూ! నేను తెలిసీతెలియక తప్పుగా మాట్లాడినా, నిన్ను నొప్పించినా నన్ను మన్నించు’ అని లక్ష్మణుడు వేడుకున్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న తర్వాత రాముడు శాంతించాడు. ‘సీతకు ఆపద కలుగుతుందేమోనన్న ఆందోళనలో తొందరపడి ఆవేశపడ్డాను. ఇది ఎంత మాత్రం తగదు’ అనుకొని సీత జాడ ఎలా తెలుసుకోవాలనే ఆలోచనలోపడ్డాడు రాముడు.
రాముడు ఆవేశం వీడి శాంతించాడు. ప్రశాంతంగా ఉండి సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించాడు. సీత జాడ తెలుసుకోవడానికి సరైన దారి దొరికింది. జటాయువు ఇచ్చిన సమాచారంతో రాముడు ముందుకు సాగిపోయాడు. హనుమంతుడు, సుగ్రీవుడు పరిచయం అయ్యారు. సీత జాడ తెలుసుకున్నాడు. రావణుడిని సంహరించి తన భార్యను కలుసుకున్నాడు. అదే ఆవేశపడి ఉంటే రాముడికి ఈ విజయం దక్కి ఉండకపోవచ్చు. అందుకే.. తన కోపమే తన శత్రువు.. తన శాంతమె తనకు రక్ష అని గమనించి దాన్ని పాటించగలిగితే విజయం తథ్యం అని ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. కోపంతో ఏమీ సాధించలేమని, ప్రశాంతతతో ఆలోచించినప్పుడే కష్టాలు తొలగించుకోవడానికి దారి దొరుకుతుంది. ఈ విషయం నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఎంతటి కష్టం వచ్చినా ధర్మం తప్పవద్దనే సందేశం ఈ కథలో ఇమిడి ఉన్నది. శత్రువైన కోపాన్ని వీడి, శాంత స్వభావంతో మిత్రుత్వం కొనసాగిద్దాం. ధర్మాన్ని పాటిద్దాం.
-నూతి శివానందం 73375 55084