సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ
(భగవద్గీత 18-66)
‘అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్నొక్కణ్ని త్రికరణశుద్ధిగా శరణువేడు. అన్ని పాపాల నుంచి నిన్ను విడిపిస్తాను-అంటే కర్మక్షయం చేస్తాను. చింతించకు’ అన్నాడు శ్రీకృష్ణుడు. అన్ని ధర్మాలు-అంటే కొన్ని స్వధర్మాలు, కొన్ని పరధర్మాలు. తన శరీరానికి మనసుకు సరిపడినవి, తనకు సహజం అనుకున్నవి స్వధర్మాలు. కానివి పరధర్మాలు. ఇలా ఎన్నో ధర్మాలు, కర్తవ్యాలు. ఇవన్నీ భగవంతుడు కల్పించినవే! ఎందుకు కల్పించాడంటే ఏ పనీ లేకపోతే మానవుడు ఉండలేడు. ‘ఖాళీ మనస్సు దయ్యాల కార్ఖానా’ అనే లోకోక్తి ప్రాచుర్యంలో ఉన్నదే! అందుకే మనిషి ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నుడై ఉండాలి. అదే ఆరోగ్య లక్షణం.
పై శ్లోకంలో ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య’- అన్ని ధర్మాలను వదిలిపెట్టు అన్నాడు భగవంతుడు. అన్నీ ఆయన కల్పించినవే! మరి వాటిని వదిలిపెట్టు అనడంలో సామంజస్యం ఏమిటి? ఆంతర్యం ఏమిటి? అని పరిశీలిస్తే కొన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయి. ఈ ధర్మాలన్నీ నిర్వర్తించవలసినవే! అందులో అనుమానం లేదు. కానీ, ఇవే శరణ్యం, ఇవే సర్వస్వం అనుకోకూడదు. అలాగని పూర్తిగా మానేయాలనీ కాదు, చేస్తూ పోవాలి. అయినా చేస్తూ పోయే పనులే సర్వస్వం అనుకోకూడదని తాత్పర్యం.
ఒకవేళ ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టాలని అనుకుంటే ఎలా? అందుకే రెండో పాదంలో ‘మామేకం శరణం వ్రజ’ అన్నాడు కృష్ణుడు. ‘నన్నొక్కణ్ని శరణు వేడు’ అన్నది మార్గాంతరం. శరణు వేడటం అంటే ‘ఇక నా పని అయిపోయిందని, సోమరిగా కూర్చోవచ్చ’ని కాదు. నిశ్చింతగా ఉండాలి. ఉంటూనే తమ కర్మ ఏదో తాము చేస్తూ పోవాలి. అంటే పురుషకారాన్ని (ప్రయత్నాన్ని) మానకూడదు. ఉదాహరణకు పాండవులు శ్రీకృష్ణుడి శరణాగతులే అయినా అరణ్య, అజ్ఞాతవాస సమయాల్లో తమ పనులు తాము నిర్వర్తిస్తూ పోయారు. తమ ప్రయత్నాలకు ఏ లోపం రానీయలేదు. మధ్య మధ్య ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు కష్టాలపాలైన ప్రతిసారి ‘నేనున్నాను’ అంటూ శ్రీకృష్ణుడు నిరూపిస్తూనే వచ్చాడు. రక్షించేవాడు మనవాడైతే ఎన్ని కష్టాలు వస్తే మాత్రం ఎందుకు భయపడాలి? ఎందుకు విచారించాలి? అనే భావన మేల్కొని ప్రతిక్షణం భగవత్ విశ్వాసాన్ని దృఢతరం చేయాలి. పాండవుల కష్టాలు ప్రత్యర్థుల (కౌరవుల) పాపాలు క్రమంగా పండటానికి ఆస్కారం ఏర్పడటం కోసమే తప్ప, పాండవులు ఇక్కట్ల పాలు కావడానికి కాదు. వాటి ప్రయోజనం అదీ!
‘నీవు వినయ విధేయతతో నడుచుకో! భక్తి విశ్వాసాలతో మసలుకో! శరణాగతి వల్ల నా నుంచి పూర్తి రక్షణ పొందుతావు. కానీ, ప్రయత్నమే సర్వస్వం అనుకొని, ‘నేనే గొప్ప మొనగాణ్ని’ అనే భావన మాత్రం తలెత్తనీయకు’ అన్నది శ్రీకృష్ణ భగవానుడి వాక్కులోని ఆంతర్యం. రావణాదుల పురుషకారం ఎంత గొప్పదైనా పక్కదారి పట్టడానికి కారణం అదే!
‘పైన పేర్కొన్న విషయాలు పురుషకారానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కానీ, శరణాగతి ప్రాధాన్యం లేదు కదా!’ అనవచ్చు. భగవానుడిని శరణుజొచ్చిన వాడు నామమాత్రంగా ప్రయత్నించినా సఫలీకృతుడు కాగలుగుతాడు. పారలౌకిక ప్రయోజనాన్ని కాంక్షించే సందర్భాలలో ఇది చాలాసార్లు నిరూపితమైంది. అదే లౌకిక ప్రయోజనం కోరినట్లయితే పురుషకారం ఎక్కువ శాతం వినియోగించాల్సి ఉంటుందని భావించవచ్చు. శరణాగతి, పురుషకారం రెంటినీ సమానంగా నడిపించే తీరును బట్టి ఇహపరాలు రెండూ సాధ్యమవుతాయి. పూర్తి పారలౌకిక ప్రయోజనానికి మాత్రమే ఉద్దేశించిన సందర్భాల్లో శరణాగతికే అధిక ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు.
డాక్టర్ వెలుదండ సత్యనారాయణ
94411 62863