తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. తిరుపతి చేరుకున్న సీఎం జగన్ తొలుత గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్ తిరుమల చేరుకున్నారు. తిరుపతికి రాగానే తిరుపతి గ్రామ దేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. సీఎం జగన్కు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం జగన్కు అక్కడి అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రవేశపెట్టింది. 100 ఈ-బస్ సర్వీసుల్లో 50 బస్సులు తిరుపతి-తిరుమల మధ్య నడవటం సంతోషకరమని సీఎం జగన్ అన్నారు.
అక్కడి నుంచి తిరుమలకు చేరిన తిరుమలలో జగన్కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మరికాసేపట్లో స్వామి వారు పెదశేష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. తిరుమల మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహన సేవలో కూడా సీఎం జగన్ పాల్గొంటారు.