శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున గంగాధర మండపం నుంచి ఆలయ ప్రవేశం చేసిన సీజేఐ దంపతులకు శ్రీకృష్ట దేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే తిలకధారణ చేసి.. సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్ల సుప్రభాత సేవ, మహామంగళ హారతి దర్శనాలు చేసుకుని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకుని హారతులు అందుకున్నారు.
అనంతరం ప్రాకార మండపంలో.. ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ వెంట తెలంగాణ చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర దంపతులు, సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రవీంద్రబాబు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ జడ్జి సత్యవతి, అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, దేవాదాయ కమిషనర్ హరిజవహర్లాల్, కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాగర్, ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి, ఆర్డీవో హరిప్రసాద్, డీఎస్పీ శృతి ఉన్నారు. ఆలయ ప్రాకారంలోని పరివార దేవతలను దర్శించుకున్న రమణ దంపతులు మధ్యాహ్నం కంచికామకోటి మఠంలో జరుగుతున్న రుద్ర చండీ హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.