అమ్మ రంగు పసుపు. అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు. అమ్మ వెలసిన కొలను పసుపు. పవిత్రతకు మారుపేరైన పసుపు.. లౌకికంగా రోగ నివారిణి. ఆ పసుపు కొమ్ములో కొలువై ఉండే బగలాముఖి కొలిచిన వారికి కొంగు బంగారం. నమ్మిన భక్తులను అమ్మ ప్రశాంత వదనంతో అనుగ్రహిస్తుంది. అరిషడ్వర్గాల మాయలో కొట్టుమిట్టాడుతున్నవాణ్ని తల్లిలా దండించి దారికి తెస్తుంది. అంతర్గత శత్రువులను రూపుమాపి పునీతుణ్ని చేస్తుంది. దశమహావిద్య సాక్షాత్కరించిన ఆదిపరాశక్తి రూపాల్లో బగలాముఖి ఒకటి. దరిద్రాలన్నిటినీ రూపుమాపే హరిద్రహ్రద వాసిని విశేషాలు ఇవి..
Chintana | కృతయుగంలో ప్రళయం సంభవించింది. ముల్లోకాలూ జల విలయంలో చిక్కుకున్నాయి. ఎటుచూసినా అంధకారం. అంతటా అల్లకల్లోలం. మనుషుల ప్రాణాలమీదికి వచ్చింది. దేవతల అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఈ ప్రళయాన్ని నివారించకపోతే సృష్టి ఆదిలోనే అంతమయ్యే ప్రమాదం వాటిల్లింది. ఇంద్రాది దేవతలంతా విష్ణుమూర్తిని వేడుకున్నారు. ఈ విపత్తును చిత్తు చేయగల యుక్తి ఆ పరాశక్తికే ఉందనుకున్నాడు మహావిష్ణువు. సౌరాష్ట్రలో (ప్రస్తుత గుజరాత్) ఒక పసుపు కొలను దగ్గర పరాశక్తి గురించి తపస్సు ఆచరించాడు. విష్ణువు తపస్సుకు మెచ్చిన సృష్టికారిణి ఆ పసుపు కొలనులో పసుపు వర్ణంలో బగలాముఖిగా ఆవిర్భవించింది. లోకాలను ముంచెత్తిన ప్రళయ జలాలను లిప్తపాటులో లుప్తం చేసింది. ఉపద్రవాన్ని స్తంభింపజేసిన దేవత కాబట్టి, ఆ పరాదేవిని తంత్రశాస్త్రం స్తంభన దేవతగా స్తుతించింది. అమ్మ అనుగ్రహం బ్రహ్మాస్త్రంలా తిరుగులేనిది. అందుకే, ఆ తల్లిని బ్రహ్మాస్త్ర దేవత అని కూడా పిలుస్తారు.
దేవీ భాగవతాన్ని అనుసరించి దశమహావిద్య ఆవిర్భావ కథ ఆసక్తికరంగా ఉంటుంది. దీని అనుసారం.. దక్షుడు మహాయాగం తలపెడతాడు. ఆదిదంపతులకు ఆహ్వానం అందదు. కానీ, పుట్టింటిపై మమకారంతో తండ్రి చేస్తున్న క్రతువుకు వెళ్తానంటుంది సతీదేవి. ఆలిపై అలిగిన శివుడు ఆమెను కోపగించుకుంటాడు. తన ఇష్టాన్ని కాదన్న రుద్రుడిపై సతీదేవి ఆగ్రహం మిన్నంటుతుంది. భీకర రూపం దాలుస్తుంది. సతీదేవి రౌద్రరూపాన్ని చూసి భయపడి పారిపోబోతాడు శంకరుడు. శివుణ్ని అడ్డుకునేందుకు అమ్మవారు దశమహావిద్యా స్వరూపాలతో (పది రూపాలు) అవతరించింది. అందులో ఒకటి బగలాముఖి.
శాక్తేయంలో బగలా ఉపాసన ప్రత్యేకమైనదిగా చెబుతారు. అమ్మను ఆరాధిస్తే బుద్ధి చేతనం అవుతుంది. సకల సిద్ధులూ కలుగుతాయని నమ్మిక. శత్రువులు నాశనం అవుతారని కూడా పేర్కొంటారు. అయితే, శత్రునాశిని అనగానే ఉగ్ర రూపిణి అనే భావన కలుగుతుంది. బగలాముఖి రూపాన్ని గమనిస్తే.. అసురుడి నాలుకను బయటకు లాగి, దండంతో దండిస్తున్నట్టుగా ఉంటుంది. అకారణంగా ఏ దైవమూ ఎవరినీ శిక్షకు గురిచేయదు. బగలాముఖి.. మనలోని అంతర్ శత్రువులను రూపుమాపే దైవం. శత్రువుల్లో మనపై ఉన్న వైరి భావాన్ని తొలగిస్తుందని భావం. శత్రువులను మిత్రులుగా మారుస్తుందని ఉపాసకులు చెబుతారు. బగలా అమ్మవారి ఆరాధనతో సంకల్పం సిద్ధిస్తుందనీ, మనోబలం కలుగుతుందనీ విశ్వసిస్తారు.
అత్యంత మహిమాన్వితమైన బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం దక్షిణ భారతదేశంలోనే తొట్టతొలిగా తెలంగాణలోని శివంపేట క్షేత్రంలో ఏర్పాటైంది. ప్రముఖ బగలా ఉపాసకులు శాస్ర్తుల వేంకటేశ్వర శర్మ నెలకొల్పిన ఈ క్షేత్ర ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 28, 29 తేదీల్లో జరగనుంది. ఈ సందర్భంగా శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారు పసుపు కొలనులో ఆవిర్భవించిందని సాంఖ్యాయన తంత్రం చెబుతున్నది. దానిని అనుసరించి ఇక్కడ దశమహా విద్యలతో కూడిన గర్భాలయం, దాని చుట్టూ కమలం, దానిని అనుసరిస్తూ పసుపు నీళ్ల కందకం ఉండేలా గర్భాలయం నిర్మించారు. పరిపూర్ణ శాక్తధామంగా విరాజిల్లుతున్న పీఠంలో అమ్మవారికి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతీ అమావాస్య, పౌర్ణమి తిథుల్లో విశేష హోమం చేపడుతున్నారు. శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవానికి అశేష సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే దారిలో నర్సాపూర్ నుంచి శివంపేట 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తూప్రాన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలు, బస్సులు ఉంటాయి.