ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఒక యువకుడు ఒత్తిడికి గురయ్యాడు. స్నేహితులందరూ తనను చూసి నవ్వుతున్నారని, ఎగతాళి చేస్తున్నారని, తన గురించే మాట్లాడుకుంటున్నారని తల్లితో చెప్పి బాధపడసాగాడు. తల్లి నవ్వి ‘అమాయకుడా! 24 గంటలూ నీ గురించే మాట్లాడుకుంటున్నారని ఎందుకనుకుంటావు? వాళ్లకు వేరే పనులేవీ లేవనుకుంటున్నావా? అయినా ఎన్నాళ్లని నీ గురించి మాట్లాడుకుంటారు. కొన్నాళ్లకు మానుకుంటారు. వాళ్లేం నీ గురించి ఆలోచించే ఉద్యోగం చేయడం లేదు కదా’ అన్నది. ‘అంతేకాదు, ఈ ప్రపంచం చాలా పెద్దది. మన గురించే ఆలోచిస్తూ కూర్చునే తీరిక, ఓపిక, అవసరం ఎవ్వరికీ ఉండవు.
ఎవరి ప్రపంచం వారిది. వాళ్లు నీ గురించి ఆలోచిస్తున్నారని, నువ్వు ఆదే ఆలోచిస్తూ ఉండటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. అయినా ఒకరి ఆలోచనలతో నీకేం పని? ఉద్యోగం లేకుంటే అడిగే వాళ్లు, మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈర్ష్యపడతారు. జీతం తక్కువగా ఉంటే వెక్కిరించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. నువ్వేం వాళ్ల కోసం బతకడం లేదు. నీ జీవితం నీది. ఒకటి గుర్తుపెట్టుకో నాయనా! పిట్ట.. చెట్టును గుర్తుపడుతుంది. చేప జలాన్ని గుర్తుపడుతుంది. కానీ, ఆ చెట్లు, నీళ్లు వాటిని గుర్తుపెట్టుకోవు కదా! అలాగే నీ ఉద్యోగ విషయం, మిత్రులు వెక్కిరించిన విషయం నీకు బాగా గుర్తుంటుంది. నీ మిత్రులకు గుర్తుండదు’ అని ధైర్యం చెప్పింది. ఆలోచనలు వీడి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆ యువకుడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821