సనాతన సంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలు బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి, విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భావిస్తారు. అంతేగాక, విశ్వంలోని అత్యంత ప్రాచీనమైన సనాతన సంప్రదాయాల్లో ఒకటైన బ్రహ్మ సంప్రదాయానికి ఆది గురువు కూడా ఆయనే. బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయంలో భాగమే హరేకృష్ణ ఉద్యమం! బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కలియుగ దైవమైన వేంకటేశ్వరునికి జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటున్నది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని పురాణోక్తి. అప్పటి నుంచి ప్రతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకను పురస్కరించుకొని ఏటా ఈ ఉత్సవాలు నిర్వర్తించడం సంప్రదాయంగా వస్తున్నది.
ధర్మ సంస్థాపన కోసం ప్రతియుగంలో దేవాదిదేవుడైన విష్ణుమూర్తి ఈ లోకంలో అవతరించి సమస్త ప్రాణులకూ శుభాన్ని చేకూరుస్తాడు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. తన భక్తులను అనుగ్రహించిన ఆ దేవదేవుడే మనందరం కొలిచేందుకు వీలుగా అర్చామూర్తి రూపంలో లోకంలో వెలుస్తాడు. అర్చామూర్తికి, సాక్షాత్తూ భగవంతుడికీ మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. తన సేవాభాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి భక్తిని పెంపొందించుకునేందుకు వీలు కల్పించడమే అందులోని ఆంతర్యం. భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మరిచి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మనలో తిరిగి ఆ సంబంధాన్ని మేల్కొల్పడమే దేవాలయాల్లో నిర్వహించే పలు ఉత్సవాల వెనుక గల ముఖ్య ఉద్దేశం. భగవంతుడికి నిర్వర్తించే ప్రతీ వేడుక మన మనసులో దేవుడి స్థానాన్ని మరింత పదిలపరచి, భగవన్నామ స్మరణను ద్విగుణీకృతం చేసేందుకే. అందులో బ్రహ్మోత్సవాలు ప్రత్యేకమైనవిగా చెప్తారు.
అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మదేవుడు సహా సకల దేవతలు, దిక్పాలకులూ విచ్చేస్తారు. ‘బ్రహ్మ’ అంటే ‘ఉత్తమం’ అని కూడా అర్థం ఉన్నది. బ్రహ్మోత్సవాలు అంటే ఆలయంలో జరిగే ఉత్తమ ఉత్సవాలని కూడా ప్రశస్తి. వీటిని ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఐదురోజులు, తొమ్మిది రోజులు, ఇంకా ఎక్కువ రోజులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులకు ఎన్నో సేవలు చేస్తారు. స్వామివారి ఉత్సవమూర్తికి ప్రతిరోజూ విశేష అలంకారాలు చేస్తారు. అంతేకాదు నిత్యం గరుడ, హనుమ మొదలైన వాహనాలపై ఊరేగిస్తారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు, కల్యాణం తదితర వైదిక క్రతువులను శాస్త్రబద్ధంగా జరిపిస్తారు. విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఆవిష్కరించే ధ్వజారోహణంతో మొదలై చివరిరోజు ధ్వజావరోహణం, మహా సంప్రోక్షణతో ఉత్సవాలు ముగుస్తాయి.
భగవంతుడెన్నడూ ఒంటరివాడు కాదని ఈ ఉత్సవాలు మనకు తెలియజేస్తాయి. భగవంతుడి ధామం అంటే నిత్యకల్యాణం, పచ్చతోరణంగా నిత్యం భక్తులతో భాసిల్లే ఆనంద నిలయం. ఆధ్యాత్మిక ప్రపంచంలోని భగవంతుడి నిజధామంలో జరిగే ఉత్సవాలనే మన ఆలయాల్లో అర్చామూర్తికి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడి పట్ల భక్తిప్రపత్తులను చాటుకునేందుకు సమస్త భక్తులకు ఇదో గొప్ప సదవకాశం. ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొని భక్తిమార్గంలో తోటి భక్తులతో కలిసి భగవంతుడికి సేవలు చేసే భాగ్యం పొందినవారు తప్పకుండా వైకుంఠంలో, గోలోక బృందావనంలో స్వామివారి ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు.
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి
93969 56984