మంగళవారం త్యాగరాజస్వామి ఆరాధన
త్యాగయ్య జీవిత చరిత్రను ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్ లోకానికి అందించారు. వీరిద్దరు తండ్రీ కొడుకులు. త్యాగయ్య జీవితం మొదటి భాగంలోని విశేషాలు తండ్రి రాయగా, రెండవ భాగంలోని విశేషాలను కుమారుడు రచించారు.
వేద చర్చల్లో త్యాగయ్య.. వ్యాసుడంతటి వాడు. మృదుమధుర వాక్యరచనలో వాల్మీకి సమానుడు. వైరాగ్యంలో శ్రీశుకుని సరిసాటి. భక్తిలో ప్రహ్లాదుడంతటి మేటి. సాహితీసృష్టిలో పుంభావ సరస్వతి. సంగీత సాధనలో నారద సమానుడు. రామ నామ రసాస్వాదనలో పరమశివుడికే పోటీ! కర్ణాటక సంగీత స్వరకర్తగా, నిరంతర గానలోలునిగా, నాదజీవిగా ఆ‘కృతి’ దాల్చిన సంగీత స్వరూపం త్యాగరాజస్వామి. నిధి కన్నా.. రాముని సన్నిధి సుఖమని తరించిన వాగ్గేయకారుడి అమృత జీవనం.. నిజమైన భక్తికి పరమపద సోపానం.
అనాదిగా వ్యక్తి వికాసంలో సంగీత, సాహిత్యాలు శిఖరాయమానంగా నిలిచాయి. తెలుగు సాహిత్యానికి కవిత్రయం, పోతన, శ్రీనాథుడు తదితర కవులు నిర్దుష్టమైన సంప్రదాయాన్ని చూపించారు. సంగీత సామ్రాజ్యానికి ఉన్నతమైన సంప్రదాయ మార్గాన్ని చూపించి, సంపూర్ణ వికాసదీప్తిని కలిగించిన ద్రష్ట త్యాగయ్య. యుగయుగాలుగా, తరతరాలుగా భరతజాతికి ఆదర్శ దైవమైన శ్రీరామచంద్రుడిని త్రికరణ శుద్ధిగా తన హృదయంలో ప్రతిష్ఠించుకొని, తన జీవితాన్ని ధన్యం చేసుకున్న నాదోపాసకుడు ఆయన. శొంఠి వేంకట రమణయ్య దగ్గర శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన త్యాగరాజస్వామి తన జీవితకాలంలో సుమారు 24,000 కృతులను రచించారని చెబుతారు. అయితే, కేవలం 600 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని ‘త్యాగోపనిషత్తులు’గా అభివర్ణిస్తారు. ఆ కృతులను భావన చేయగలిగిన వారికి అవి ఉపనిషత్తులతో సమానమైన జ్ఞాన వాహినులుగా మదిలో మెదులుతాయంటారు.
భాషకు అతీతమైన అతీంద్రియ శక్తి సంగీతానికి ఉంటుంది. ఆ సంగీత సాధనే నాదోపాసన. ఆ నాదోపాసనే ప్రణవోపాసన. నాదోపాసనతో అంతర్గత శ్వాసలో మార్పులు జరుగుతాయి. అది ప్రాణాయామంతో సమానమని యోగ శాస్త్రజ్ఞులు చెబుతారు. ‘వరవీణా వాదన తత్వజ్ఞుని..’గా త్యాగరాజు నుతించిన నారదుడే స్వయంగా ఈ వాగ్గేయకారుడికి సంగీత రహస్యాలను బోధించి, ‘స్వరార్ణవ’ అనే గ్రంథాన్ని బహూకరించాడని ప్రతీతి.
త్యాగరాజు ప్రతీ కృతి రామస్తుతే. ఆయన చేసిన ప్రతీ గానం.. రామామృతమే! వాల్మీకాదులు రామాయణాన్ని రచించి తరించారు… మరి ఆ కథను వర్ణించాలన్న తన ఆశ ఎలా తీరుతుందనే ప్రశ్నకు బదులు ‘మునులు, నరులు, నిను వర్ణించిన నా యాస దీరునా, మేల్మియై యుండు సద్భక్తులు మెచ్చుదురే త్యాగరాజ నుత’ కీర్తన. నవ్వుతూ పలకరించడం.. ముందుగా తానే పలకరించడం రాముడి లక్షణం! అందుకే ‘ఏమని మాట్లాడితివో రామ.. ఎవరి మనసుకే విధమో దెలిసి..’ అని మరో కీర్తనలో రామయ్యను పొగుడుతారు. ‘వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి.. పుడమిలో జనులెల్ల పొగడ.. పూజితుడౌ మునితో గూడి’ అని రాఘవుడి అవతార ప్రయోజనాన్ని విశదీకరించారు. ‘శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే’ అని అహల్య శాప విమోచన ఘట్టాన్ని ఆవిష్కరించారు. ‘తెలియలేరు రామభక్తి మార్గమును.. ఇలనంతట తిరుగుచును కలవరించెదరు గాని… తెలియలేరు వేగలేచి నీటమునిగి బూదిపూసి వేళ్లనెంచి శ్లాఘనీయులై బాగ పైకమార్జనులునైరే గాని.. త్యాగరాజ వినుత తెలియలేరు రామ భక్తి మార్గమును’ అనే కృతితో సంఘంలోని కుసంస్కారాలను ఎత్తిచూపారు.
తండ్రి దగ్గర రామతారక మంత్ర ఉపదేశం పొందిన త్యాగయ్య దాదాపుగా 20 ఏండ్లపాటు జప సాధన చేశారు. ఆ సమయంలో ఆయనకు రామ దర్శనం అయిందని.. అలా దర్శించిన శ్రీరాముని చూస్తూ ఆనందంతో.. అప్రయత్నంగా ‘బాలకనకమయ చేల…’ అన్న కృతితో రాముణ్ని కీర్తించారని తెలుస్తున్నది. సుమారు 96 కోట్ల రామనామం జపించారని, రామకథామృతాన్ని రాగ తాళ సమన్వయంతో పాడుకుంటూ తన్మయుడై తరించారని చెబుతారు.
తంజావూరు రాజు ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు పంపి రాజసభకు రావాలని ఆహ్వానించగా త్యాగరాజు ‘నిధి చాల సుఖమో రాముని సన్నిధి సేవ సుఖమో నిజముగ బల్కు మనసా’ అంటూ శ్రీరాముని చరణ సన్నిధే తనకు పెన్నిధి అని చాటిచెప్పారు. తన జీవిత చరమాంకంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన త్యాగయ్య 80 ఏండ్లకు పైగా జీవించి, తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడిలో ఐక్యమయ్యారు. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు..’ అని పలికిన నిగర్వి, సిద్ధపురుషుడైన త్యాగయ్య నామస్మరణం రామాంకితం అవుతుంది.
ధన్యజీవి
త్రిలోకాలతో అవిచ్ఛిన్నమైన అనుసంధానాన్ని కలిగి ఉండటం భారతీయ చింతనలో ఒక విలక్షణమైన స్థితి. సర్వవ్యాప్తమైన
చైతన్యానికి అనుసంధానమైనప్పుడు భౌతిక జీవనంలో పరిమిత మనసు త్రిగుణాలకు అతీతమై ఆనందానుభవాన్ని పొందుతుంది. ఆ స్థితిని సంగీత సాధనలో సాధించినవారు త్యాగయ్య. సంగీతంలో తన్మయత్వాన్ని పొంది, అరవిందులు పేర్కొన్న ఉన్నత మనసు, ప్రదీప్త మనసు, ప్రబుద్ధ మనసు, అతీత మనసులనే సోపానాలను
అధిగమించి భగవత్ దర్శనం పొందిన మహోన్నత వ్యక్తి ఆయన. మనోపరిమితులకు, దేశకాల పరిధులకు అతీతంగా
తాను చేస్తున్న నాదసాధనా ధ్యానంలో తరించిన ధన్యజీవి త్యాగరాజు.
…? పాలకుర్తి రామమూర్తి