ఈ సృష్టి నిర్మాణం ప్రాణికోటి కోసం జరిగినప్పటికీ, వేదాల ఆవిర్భావం మాత్రం మానవుల కోసమే అని నిర్దంద్వంగా చెప్పవచ్చు. వేదం ‘మనుర్భవ, జనయ దైవ్యం జనం’ (రుగ్వేదం 10-53-6) అని ఉపదేశిస్తుంది. మనిషి కావాలి, మంచి సంతానాన్ని కనాలి అని దాని భావం. వేదం అందరిదనే విషయాన్ని మరచిపోకూడదు. అన్ని కాలాల్లో మనం ధర్మాన్ని విడిచిపెట్టరాదని వేదం ప్రబోధిస్తున్నది. ‘శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్’- మానవశరీరం ధర్మాన్ని పాటించడానికే ఉందని వేదం గుర్తుచేస్తుంది. అంతేకాదు మానవజన్మ 84లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనది. కాబట్టి జన్మ సార్థక్యం కోసం ప్రయత్నించమని చెబుతుంది. ‘కృణ్వంతో విశ్వమార్యం’ (రుగ్వేదం 9-83-5) అంటే విశ్వజనులందరూ శ్రేష్ఠులుగా మెలగాలనే ఆకాంక్ష వేదపురుషుడిదని తేటతెల్లమవుతుంది.
వేదం నాలుగు విధాలైన పురుషార్థాలను ప్రతిపాదిస్తుంది. పురుషార్థాలు అంటే మనుషులు సాధించదగిన సంపదలు అని అర్థం. అందులో మొదటిది ధర్మం, చివరిది మోక్షం. మధ్యలో ఉన్నవి అర్థకామాలు. ఈ రెండిటినీ సాధించడంలో ధర్మాన్ని విడిచిపెట్టరాదని, సంసారంలో ఉన్నప్పటికీ ధర్మం ద్వారా మోక్షాన్ని సాధించాలని వేదం స్పష్టం చేస్తుంది. పురుషార్థాలలో మోక్షమే గొప్పది. అది సంసార వృక్షానికి చివరి ఫలం. మానవజన్మ ఎత్తడం ఒక ఎత్తయితే, మోక్షాన్ని సాధించడం మరో ఎత్తు. నిజానికి ఎన్నో జన్మలు దాటి, మనుష్య జన్మ ఎత్తిన మనం ఈ జన్మలో కోరదగిందీ, అన్నిటికన్నా ముఖ్యమైనది మోక్షమే! లోకంలో మోక్షాన్ని వద్దనేవారు ఉండరు. కానీ, దాన్ని సంపాదించడం అంత సులభం కాదు. భోగమార్గం నుంచి యోగమార్గంలోకి అంటే ప్రేయోమార్గం నుంచి శ్రేయోమార్గంలోకి ప్రవేశిస్తే కానీ మోక్షం లభించదు.
మన చరిత్రలో ఎంతోమంది మహాపురుషులు కనిపిస్తారు. వారంతా మోక్షం కోసం జ్ఞానమార్గంలో నడిచినవారే! ఇంద్రియాలను నిగ్రహించుకొని తపస్సాధనలో మునిగినవారే. ఆధునికంగా కొందరి చరిత్రలను గమనిస్తే, మోక్షానికి అర్హత ఉండికూడా, తిరిగి జన్మ (మానవ రూపం) ఎత్తాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వారిలో వివేకానందుడు, అరవిందుడు, మలయాళస్వామి, శివానందులు ముఖ్యులు. ఎన్నిసార్లయినా ఈ పుణ్యభూమిలో జన్మించాలన్న దృఢమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈశ్వర సృష్టిలో ఏ జీవికి ఒక శరీరం రావాలన్నా అది ఈశ్వరాధీనమై ఉంటుంది. ఏ జీవికీ తాను స్వయంగా జన్మను ఎంచుకోవాల్సిన సామర్థ్యం కనిపించదు. కానీ, యోగుల విషయంలో ఈశ్వరానుగ్రహం వల్ల ఒక సౌక ర్యం కనిపిస్తుంది. అదే తిరిగి మానవ జన్మ ఎత్తడం.
సృష్టి మొదట్లో పరమేశ్వరుడు జీవులను స్వీయకర్మలకు అనుగుణంగా శరీరధారులను చేశాడు. రుషులకు కూడా అతనే శరీరాలను సృష్టించాడు. కానీ, యోగులు మాత్రం స్వయంగా తామే శరీరాలు కోరుకుంటే, అవే వారికి సిద్ధిస్తాయి. మోక్షాన్ని కూడా కాదని, మానవ శ్రేయస్సు కోసం జన్మలెత్తేవారే అవతార పురుషులు, మహాత్ములు.
…? ఆచార్య మసన చెన్నప్ప
98856 54381