కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన పెద్దలు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. భూమి, సూర్యుడు ఈ రెండిటి సంబంధం దక్షిణాయనాన్ని విలక్షణంగా ఆవిష్కరిస్తుంది. ఆ విశేషాలివి..
మన ఇంట్లోకి తూర్పు గుమ్మం నుంచి ప్రవేశించే ఎండ కొంతకాలం తిన్నగానూ, కొంతకాలం దక్షిణం వైపు, మరికొంత కాలం ఉత్తరం వైపునకు పడుతుంది. ఇందుకు కారణం.. సూర్యుడు తూర్పునే ప్రభవిస్తున్నా, రోజూ ఒకేచోట ఉదయించక పోవడమే. ఇందుకు కారణం భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య వృత్తాకారంగా కాకుండా, కోడిగుడ్డులా వలయంగా ఉండటం, భూమి నిటారుగా కాకుండా 23 1/2 డిగ్రీలు సూర్యుడి దిశగా వంగి ఉండటం మరో కారణం.
సూర్యుడి దిశగా వంగి ఉన్న భూతలం భూమధ్యరేఖకు ఎగువన ఉండే ఉత్తరార్ధం. భూకక్ష్య సాగిన వలయాకారంగా ఉండటం వల్ల భూమి సూర్యుడికి కొన్నాళ్లు దగ్గరగానూ, కొన్నాళ్లు దూరంగానూ ఉంటుంది. సూర్యుడికి భూమి దగ్గరగా ఉన్నప్పుడు ఉత్తర ధ్రువప్రాంతం, దూరంగా ఉన్నప్పుడు దక్షిణ ధ్రువప్రాంతం అధిక సూర్యరశ్మికి లోనవుతుంటుంది.
సూర్యుడు ఉదయించే చోటు కాలక్రమంలో ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి, ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి పయనిస్తున్నట్లు ఉంటుంది. ఈ పయనాన్ని అయనం అంటారు. సూర్యుడు ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి పయనించే క్రమాన్ని దక్షిణాయనం అనీ, ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి పయనించే క్రమాన్ని ఉత్తరాయణం అనీ అంటారు. ఉత్తరాయణ, దక్షిణాయన ప్రయాణ క్రమంలో సూర్యుడు రెండుసార్లు సరిగ్గా భూమధ్య రేఖపై ఉదయిస్తాడు. ఆ రోజు పగలు, రాత్రి సమంగా ఉంటాయి. వీటిని విషువత్తు అంటారు. విషువత్తును నిర్వహించే దేవుడు విష్వక్సేనుడు. వీటినే ఇంగ్లిష్లో ‘ఈక్వినాక్స్’ అంటారు.
సూర్యుడు అశ్వనీ నక్షత్రంలోకి అంటే మేషరాశిలోకి ప్రవేశించే రోజును వసంత విషువత్తు అంటారు. సూర్యుడు చిత్తా నక్షత్రం మూడో పాదంలోకి అంటే తులా రాశిలోకి ప్రవేశించే రోజును శరత్ విషువత్తు అంటారు. వసంత విషువత్తు నుంచి శరత్ విషువత్తు వరకు సూర్యుడు.. భూమి ఉత్తరార్ధ గోళానికి ఎక్కువ వెలుగులు ప్రసాదిస్తాడు. శరత్ విషువత్తు నుంచి వసంత విషువత్తు వరకు భూమి దక్షిణార్ధ గోళానికి ఎక్కువ వెలుగును ఇస్తాడు.
సూర్యుడు 13 నుంచి 14 రోజులకు ఒకసారి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారుతాడు. మొత్తం 27 నక్షత్రాల మీదుగా పయనం సాగిస్తాడు. ఇలా భానుడు నక్షత్రం మారే సందర్భాన్ని మనవాళ్లు కార్తె అని, రాశి మారే సందర్భాన్ని సంక్రమణం అని పేర్కొన్నారు. మార్తాండుడు సుమారు నెలకో రాశి చొప్పున మారుతుంటాడు. సౌరమానంలో నెలలను రాశుల పేర్లతోనే పిలుస్తారు.
సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకునే సంక్రమణలను మాత్రమే సంక్రాంతులు అంటారు. అవే కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి. సూర్యుడు మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తర దిశలో పయనిస్తాడు కాబట్టి ఆ సమయాన్ని ఉత్తరాయణం అంటారు. కర్కాటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు దక్షిణ దిశలో పయనిస్తాడు కాబట్టి అది దక్షిణాయనం.
సూర్యుడు ఒక్కచోట నిలకడగా ఉదయించని కారణంగా విషువత్తు దినాలలో తప్ప మిగిలిన అన్ని రోజులలో, అయితే రాత్రి దీర్ఘంగా ఉంటుంది, లేదంటే పగలు దీర్ఘంగా ఉంటుంది. అయనాంశ కారణంగా విషువత్తు… మన లెక్కల ప్రకారం రావలసిన సమయానికంటే ముందుగా వస్తుంది. విషువత్తు ముందుకు జరిగిన కారణంగా కర్కాటక మాసంలో రావలసిన సుదీర్ఘమైన పగలు మిథున మాసంలోనూ, మకర మాసంలో రావలసిన సుదీర్ఘ రాత్రి ధనుర్మాసంలోనూ వస్తాయి. ఈ మార్పును గమనించిన జ్యోతిష శాస్త్రజ్ఞులు సుదీర్ఘమైన పగటి దినాన్ని జ్యేష్ఠ మాసంలో తొలి ఏకాదశిగానూ, సుదీర్ఘమైన రాత్రి గల దినాన్ని ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గానూ నిర్ణయించారు.
పాశ్చాత్యులు జూన్ 21వ తేదీని ‘లాంగెస్ట్ డే’గానూ, డిసెంబర్ 21 నుంచి 24 మధ్య ఉండే రోజుల్లో ఒకదాన్ని ‘షార్టెస్ట్ డే’గానూ లెక్కగట్టారు. వీటిని వరుసగా ‘సమ్మర్ సోల్స్టిస్’, ‘వింటర్ సోల్స్టిస్’ అని పిలుస్తారు.
దక్షిణ దిశకు యమధర్మరాజు అధిపతి. మరణించిన వారి ఆత్మలు దక్షిణ దిశగా ప్రయాణించి యమలోకాన్ని చేరుకుంటాయని మన విశ్వాసం. జీవుడు చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి అక్కడినుంచి స్వర్గ, నరకాలకు వెళ్తాడు. ఈ కారణంగా దక్షిణాయనం పితృదేవతల ఆరాధనకు పుణ్యకాలంగా చెబుతారు.
వరిగొండ కాంతారావు
94418 86824