ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం, వైరాగ్యం అనే మాటలు పదేపదే వినిపిస్తూ ఉంటాయి. ఆత్మకు సంబంధించిన వివరాలు తెలుసుకొంటే అది జ్ఞానమని, భౌతిక సాంగత్యాలు లేకుండా ఉండటం వైరాగ్యమని అందరూ చెప్పుకొంటారు. ధనం అధికంగా సంపాదించకపోవడం, కుటుంబం మీద అనురక్తి లేకుండా ఉండటం వీటిని వైరాగ్యానికి చిహ్నాలుగా భావిస్తుంటారు. కానీ శాస్త్రం వైరాగ్యాన్ని ఉన్నతంగా విశ్లేషించింది. వైరాగ్య భావనను సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ జగత్తులో ఆనందంగా జీవించడమే కాకుండా, చరమ మోక్షాన్నీ పొందగలుగుతాం.
అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజ్యత
నిర్బంధ కృష్ణసంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే
అని ‘భక్తిరసామృతసింధువు’ గ్రంథం చెబుతున్నది. ‘విషయ భోగాలను పొందాలనే వాంఛ లేకుండా, తనకు లభించిన ప్రతీ దానిని యథోచితంగా కృష్ణసేవలో వినియోగిస్తూ, దానిని తాను కూడా ప్రసాద రూపంలో స్వీకరించే వారు యుక్తవైరాగ్యంలో ఉన్నవారు అవుతారు’ అని శ్లోకానికి భావం. ఎవరు ఏ పనిని చేసినా, దానిని కృష్ణసేవకు జోడించాలి. అప్పుడు తాను చేసే పని భౌతికమైనదని భావించే స్థితి తొలగిపోతుంది. పైగా ఆ పనిని కృష్ణసేవకు వినియోగించడం ద్వారా యుక్తవైరాగ్యాన్ని అవలంబించినట్లుగానూ అవుతుంది.
బలరామకృష్ణులు బృందావనం నుంచి మథురకు మొదటిసారి వెళ్లినప్పుడు జరిగిన రెండు సంఘటనలు పైన చెప్పిన విషయాలకు చక్కని ఉదాహరణలుగా నిలుస్తాయి. మొదటిసారి మథురకు వచ్చిన బలరామకృష్ణులు అందంగా అలంకరించుకోవాలని అనుకుంటారు. ఇద్దరూ తమ మిత్రులతోపాటు ఒక నేతన్న దుకాణానికి వెళ్తారు. ఆ నేత కార్మికుడు మంచి కళాకారుడు. పైగా బలరామకృష్ణులపై ప్రత్యేకమైన భక్తి కలవాడు. వెంటనే అతను మంచి జరీ కలిగిన కండువాలతో సోదరులు ఇద్దరికీ తలపాగాలు తయారుచేసి అమర్చాడు. దుస్తులతోనే భుజాలకు భూషణాలు తయారుచేశాడు, నడుములకు అందమైన బట్టలను రమ్యంగా కట్టాడు. ఆ పనిని చిన్నచూపు చూసి, వైరాగ్యంతో పనిని ఆపేయకుండా నేతగాడు యుక్తవైరాగ్యంతో తన కళను భగవత్సేవకు వినియోగించాడు. నేతగాడి భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు అతనికి ఆ జన్మలో ఐశ్వర్యాన్ని, బలాన్ని, ప్రాభవాన్ని, స్మృతిని, ఇంద్రియ పటుత్వాన్ని ప్రసాదించాడు. మరుసటి జన్మలో సారూప్యముక్తిని అనుగ్రహించాడు. కేవలం యుక్తవైరాగ్యం ద్వారా నేతగాడు అద్భుతమైన వరదానాలను పొందాడు.
తర్వాత బలరామకృష్ణులు సుదాముడనే మాలాకారుని దుకాణానికి వెళ్లారు. సుదాముడు పూలహారాలు తయారుచేసి అమ్ముతుంటాడు. సోదరులు రాగానే అతను సుగంధభరితమైన పూలతో తయారుచేసిన ప్రత్యేకమైన హారాలను వారికి సమర్పించాడు. పరమసంతుష్టుడైన శ్రీకృష్ణుడు అతణ్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. సుదాముడు నిరంతర భక్తిని వరంగా ప్రసాదించమని అడిగాడు. శ్రీకృష్ణుడు ఆ వరాన్ని ప్రసాదించడంతోపాటు అతనికి బలం, దీర్ఘాయువు, యశస్సు, సౌందర్యం, వంశవృద్ధి ప్రసాదించాడు. యుక్తవైరాగ్యంతో సుదాముడు తాను కోరకపోయినా సమస్తాన్నీ ఈ జగత్తులో పొందగలిగాడు. అందుకే వైరాగ్యం పేరు మీద అన్నీ వదిలివేసే బదులు యుక్తవైరాగ్యంతో, అంటే సమస్తాన్నీ శ్రీకృష్ణుడి సేవలో వినియోగించి, ఈ జగత్తులో అన్ని అభీష్టాలనూ పొందడమే యుక్తియుక్తమైన మానవ జీవనం. ఇదే భాగవత విధి. భాగవత పురాణం మనకు బోధించే రహస్యం.
డా॥ వైష్ణవాంఘ్రి, సేవక దాస్
98219 14642