శ్రావణ శుద్ధ పంచమి రోజు గరుడ పంచమి, నాగుల పంచమి రెండు పండుగలు ఎందుకు చేస్తారు ?
కర్షకులకూ, ప్రజలకు, సమస్త ప్రాణికోటికీ జీవనోపాధి ప్రసాదించేది వర్ష రుతువు. ఈ రుతువు ప్రారంభంలో వచ్చేదే శ్రావణ శుద్ధ పంచమి. ఈ రోజునే కశ్యప ప్రజాపతి భార్య అయిన వినతకు గరుత్మంతుడు జన్మించాడు. అతడు అత్యంత బలశాలి. తన తల్లి వినతాదేవిని పినతల్లి కద్రువ మోసపూరితంగా పందెంలో ఓడిస్తుంది. దాసిగా చేసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న గరుత్మంతుడు ఇంద్రుడిని జయించి దేవలోకం నుంచి అమృత కలశం తెచ్చి కద్రువ కుమారులైన నాగులకు ఇచ్చి తల్లిని దాస్య విముక్తురాలిని చేస్తాడు. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆయన వాహనంగా మారిపోతాడు.
గరుత్మంతుడి అంతటి ఆరోగ్యవంతులు, ధైర్యశాలురు, మాతృభక్తి ఉన్న సంతానం కలగాలని కోరుతూ గరుడపంచమి వ్రతం ఆచరిస్తారు. అలాగే, తన సేవలో తరించిన ఆదిశేషుని కోరిక మేరకు నాగులు జన్మించిన అదే శ్రావణ శుద్ధ పంచమి రోజు మానవాళి సర్ప పూజలు చేస్తారని విష్ణుమూర్తి వరమిచ్చాడు. అందుకే ఆ రోజున నాగులకు పూజలు చేస్తారు. ఆవుపాలు, గోధుమలతో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. ఆకాశంలో విహరించే గరుత్మంతుడు (పక్షి జాతి), నేలమీద సంచరించే నాగులు ప్రకృతి సమతౌల్యతలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రకృతికి మేలు చేస్తున్న ఈ రెండు జాతులకూ కృతజ్ఞతలు తెలియజేయడం కూడా ఈ పండుగల అంతర్యాల్లో ఒకటి.
డా॥ శాస్ర్తుల ,రఘుపతి
73867 58370