ఏకో దేవో సర్వరూపీ మహాత్మా
గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః
చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్
భక్తాకారో భక్తిదో భక్తివేద్యః
‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదేవుడు అవతరించాడు. ఆయనే మళ్లీ గౌరాంగుడిగా అవతరిస్తాడు. ఆయనే చైతన్య నామధేయుడు. చిత్-శక్తి స్వరూపుడు. భక్తుడిగా అవతరించి లోకానికి భక్తిమార్గాన్ని బోధిస్తాడు. (అథర్వ వేదం-చైతన్య ఉపనిషత్తు 6)
‘గౌర’, ‘గౌరాంగ’, ‘చైతన్య’ అన్న పదాలు దేవాదిదేవుడిని సూచిస్తాయి. కలహ, కల్మషాలతో అంధకారమయమైన కలియుగంలో ఆ దేవాదిదేవుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరిస్తాడని సనాతనమైన అథర్వణ వేదం చెప్తున్నది.
ఈ యుగంలో ప్రజలు కేవలం లౌకిక విషయాలపైనే తమ దృష్టంతా సారించి, తమకు నిజమైన మేలుచేసే వాటికి దూరమవుతున్నారు. చిన్నచిన్న విషయాలకు పోట్లాడుతూ ఇంద్రియ భోగమే జీవిత పరమార్థమనే సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నిత్యం ఆతృతలు, ఆవేదనలు, జబ్బులు మొదలైనవాటితో పీడితులై నిస్సహాయులుగా ఉన్నారు. తమ బాధలకు పరిష్కారం కోసం ప్రయత్నించాలని కొందరు తలచినా సమాజంలోని అప్రామాణికమైన వ్యవస్థలు, వ్యక్తులు, పుస్తకాలు, దృశ్య శ్రవణ మాధ్యమాలతో తరచూ మోసాలకు గురవుతున్నారు. ఆధ్యాత్మిక మార్గం సైతం అసంబద్ధమైన శాస్త్ర వ్యాఖ్యానాలు, కల్పితమైన సిద్ధాంతాలతో నిండిపోతున్నది. జీవితంలో పరిపూర్ణత సాధించే మార్గమేదో తెలియక, ఆనందమయ జీవనానికి నోచుకోలేక ప్రజలు సతమతమవుతున్నారన్నది వాస్తవం.
కలియుగవాసుల కష్టాలు తెలిసిన ఆ దేవదేవుడు అత్యంత కారుణ్యంతో యుగధర్మమైన హరినామ సంకీర్తనను స్థాపించేందుకు చైతన్యుడిగా ఈ లోకంలో అవతరించాడు. జీవుడు ఏ ఆనందం కోసమైతే నిత్యం అన్వేషిస్తున్నాడో, ఆ ఆనందాన్ని ప్రస్తుత యుగంలో ప్రసాదించగల విశ్వవ్యాప్తమైన ధర్మానికే ‘యుగ ధర్మం’ అని పేరు. జీవిత పరిపూర్ణతకు ప్రతి జీవుడూ ఆశ్రయించవలసినది ఆ యుగధర్మాన్నే.
నందనందనుడు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభువుగా ఈ లోకంలో అవతరించిన శుభ తిథి ఫాల్గుణ పౌర్ణమి. దీనినే గౌర పౌర్ణమి మహోత్సవంగా చేసుకుంటారు. కలియుగ వేడిమి నుంచి జీవులను రక్షించేందుకు చల్లటి కిరణాలను ప్రసరింపజేస్తూ ఆవిర్భవించింది ఈ చైతన్య చంద్రోదయం. శ్రీ చైతన్య మహాప్రభువే ప్రస్తుత యుగ ఆరాధ్యమూర్తి.
కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదమ్
యజ్నైః సంకీర్తనప్రాయైర్ యజంతి హి సుమేధసః
(భాగవతం 11-5-32)
ఈ కలియుగంలో ఆవిర్భవించి సదా కృష్ణ నామ గానం చేసే భగవత్ అవతారమూర్తిని మేధోసంపత్తి కలిగిన మనుజులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు. తన వర్ణం నలుపు కానప్పటికీ అతను సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. సంకీర్తనోద్యమాన్ని స్థాపించడానికి తన అనుచరులతో కలిసి ఈ భువిపై అవతరిస్తారని భాగవత వాక్యం.
చైతన్య మహాప్రభువు సాక్షాత్తు కృష్ణుడే! మేలిమి బంగారు వర్ణంతో అవతరించిన కారణంగా ఆయనను ‘గౌరాంగ’ అని కూడా పిలుస్తారు. జీవుడు మోక్షాన్ని సాధించటమే ఎంతో కష్టం. అటువంటిది, దుస్సాధ్యమైన మోక్షాతీత స్థితిని అత్యంత సులభంగా పొందే మార్గాన్ని శ్రీ చైతన్య మహాప్రభువు లోకానికి అందించాడు. అదే హరేకృష్ణ నామ సంకీర్తన. పవిత్రమైన ఆ హరినామాన్ని జపించడం వల్ల జీవిత పరిపూర్ణతను పొందగలం. అయితే, ఏ భగవన్నామాన్ని మనం జపించాలి? శ్రీ చైతన్య మహాప్రభు, హరిదాస ఠాకూర్ మొదలైన వారంతా స్వయంగా జపించినది ఈ మహామంత్రాన్నే! ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ ఈ మహామంత్రాన్ని జపిస్తూ చైతన్య మహాప్రభువును, వారి పరంపరానుగతమైన ప్రామాణిక ఆచార్యులను ఆశ్రయించినవారు ఈ కలియుగ భవసాగరాన్ని సులభంగా దాటి తప్పకుండా శ్రీకృష్ణుడిని చేరుకోగలుగుతారు.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984