సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే॥
వర్షాలకు పరవశించిన భూమి వల్ల ప్రకృతి పులకరించేవి ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ మాసాలు. ప్రకృతిలోని పంచభూతాల శక్తులు ఈ నెలల్లోనే విజృంభిస్తుంటాయి. ఆయా శక్తులలో కొన్ని విపరీతాలు కూడా ఉంటాయి. కొన్నిటిని తట్టుకునే శక్తి మన శరీరాలకు ఉండనప్పుడు వాటివల్ల అనారోగ్యాలు కలుగుతుంటాయి. అందువల్ల ప్రకృతిలో వచ్చే వేర్వేరు మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని మార్చుకునే ప్రయత్నం చేయమని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆ పనిలో భాగంగానే వివిధ వ్రతాలు, నియమాలు, ఆచరణలు, ఆచారాలను నిర్దేశించింది. అటువంటి విశేషమైన వ్రతాలలో మంగళగౌరీ వ్రతం ప్రత్యేకమైంది. వ్రతం అంటే ‘నియమంతో కూడుకున్నది’ అని అర్థం. పండుగల్లో ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు కానీ, వ్రతంలో మాత్రం నియమబద్ధంగా మెలగాల్సి ఉంటుంది.
కొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలు మొదటి ఐదేండ్లపాటు శ్రావణ మాసం మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చే మాసానికి శ్రావణ మాసం అని పేరు. చాంద్రమానాల్లో ఇది విశేషమైన నెల. శ్రవణా నక్షత్రానికి విష్ణువు అధిపతి. విష్ణువు అంటే వ్యాపన శీలం కలిగినవాడు అని అర్థం. విశ్వవ్యాప్తమైన శక్తికి విష్ణువు సంకేతం. సాధారణంగా మంగళవారాలు అందరికీ మంగళాన్ని కలిగించేవే! అయినప్పటికీ, కుజుడు అధిపతిగా ఉండే ఈ రోజు మనసులో కొన్ని ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్నది. వాటిని ఉపశమింపజేసుకోవడం అవసరం. మన మనస్సుల్లో ఏర్పడే ఉద్రిక్తతలను, కొత్త జీవితాల్లో వస్తున్న అసంతులిత స్థితులను తట్టుకోవడానికి, శరీరాన్ని, మనసును పవిత్రం చేసుకునే ఉద్దేశంతో మంగళగౌరీ వ్రతాన్ని నిర్దేశించారు పెద్దలు.
‘గురు’ శబ్దానికి చీకటిని తొలగించడం, జ్ఞానాన్ని ప్రసాదించడం అని అర్థాలున్నాయి. ‘గురు’ భావంతో గౌరీదేవిని మనం స్వీకరిస్తే, ఆ తల్లి మనకు మంచి జీవిత విధానాన్ని మార్గదర్శనం చేస్తుంది. గ్రహాలలో గురు గ్రహం చాలా పెద్దది. అమ్మవారు కూడా అతి పెద్దవారు. పెద్దదిగా కనిపించే దేనినైనా ‘గురు’ శబ్దంతో ప్రయోగించడం సంప్రదాయం. గురువును, గౌరీదేవిని పూజిస్తే సమాజంలో మనకు కూడా గౌరవం పెరుగుతుంది. ఈ గౌరవాదులను ఇచ్చే గౌరీదేవిని కూడా అతిపెద్ద ప్రకృతి శక్తిగా పూజించడం మన ఆచారాల్లో భాగంగా మారింది.
విష్ణు సంబంధమైన వ్యాపన శక్తి విజృంభించే శ్రావణమాసంలో, అందరికీ శుభాలు అందించే సర్వమంగళ స్వరూప ప్రకృతి శక్తిని ఆరాధించే విధానం మంగళగౌరీ వ్రతం. వివాహం తర్వాత స్త్రీల శారీరక ప్రకృతులలో వచ్చే మార్పులను సమన్వయం చేసుకోవడానికి ఈ వ్రతం ఒక అవకాశం. వైవాహిక సౌఖ్యాన్ని పెంచుకునే మార్గాన్ని సుగమం చేస్తుంది. వైవాహిక బంధం పవిత్రమై, శాశ్వతం కావడానికి ఈ వ్రతం తోడ్పడుతుంది. అంతేకాకుండా, శరీరంలో సంతానశక్తిని బాగా పెంచుతుంది. మంగళగౌరీ వ్రతంలో అమ్మాయిలు దానం చేసే పచ్చి శనగలు కూడా గురు సంబంధమైన ధాన్యమే. సంతానకారకుడైన గురువు ఆశీస్సులు పొందడం కోసం శనగలు దానం చేయడం, తినడం ద్వారా శరీరంలో సంతానశక్తి పెంపొందుతుంది.
క్షీరసాగర మథనంలో హాలాహలం బయటకు వచ్చినప్పుడు భర్తను ఆ విషాన్ని తినడానికి ప్రోత్సహించిన ఆ ‘సర్వమంగళా’ దేవి ఆరాధనే మంగళగౌరీ వ్రతం. తమ మాంగల్య జీవనం బలపడటానికి, సత్సంతానం కలగడానికి ఈ వ్రతాన్ని మించినది లేదు. సర్వమంగళకారిణిగా అమ్మవారిని ఆరాధిస్తూ, తగిన దానధర్మాలు ఇస్తూ నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటాయి. నిజానికి ప్రతీ మంగళవారం చేసుకోదగిన వ్రతం ఇది. కానీ, అవసరాలు, సమయాల ప్రభావాల వల్ల దీనికి కాలపరిమితి విధించుకోవడం జరిగింది. సాధ్యమైనవాళ్లు శ్రావణ మంగళగౌరిని ఆరాధించి అమ్మ అనుగ్రహం పొందవచ్చు.
సాగి కమలాకరశర్మ