భాగవత నవమ స్కంధానికి లక్షణం ‘ఈశాను కథలు’. ఇందులో సూర్య, చంద్రుల వంశాల విస్తృత వర్ణన ద్వారా భగవదవతారాలు, భక్తుల చరిత్రలూ అచ్చంగా ముచ్చటింపబడినాయి! సూర్యచంద్రులు లోకంలో నిష్కామ కర్మయోగానికి నిఖార్సైన- నిలువెత్తు నిదర్శనాలు- దృష్టాంతాలు. ఈ స్కంధం వైరాగ్య ప్రధానం. కనుక, ఈ కథలు శ్రద్ధగా విన్నా, చదివినా అంతఃకరణంలోని అశుభ వాసనా దోషాలు సాంతం అంతరించిపోతాయి.
శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! పరమ పురుషుని నాభి మధ్యం నుంచి బంగారు పద్మం పుట్టింది. అందులో నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మపుత్రుడు మరీచి మహర్షి. మరీచి కుమారుడు కశ్యపుడు. అదితి, కశ్యపులకు ఆదిత్యుడు- సూర్యుడు ఉదయించాడు! సూర్యునికి సంజ్ఞయందు వైవస్వత మనువు జన్మించాడు. ఈయనే శ్రద్ధాదేవికి భర్తయైన శ్రాద్ధదేవుడు. ఈ పుణ్యదంపతులకు ఇక్ష్వాకు మొదలైన పదిమంది పుత్రులు పుట్టారు. వీరిలో ‘నభగుడు’ తొమ్మిదవ వాడు. నభగుని పుత్రుడు నీతిమంతుడైన నాభాగుడు. విద్యాధ్యయనం సాగిస్తూ దీర్ఘకాలం గురుకులంలో గడిపిన అతనికి చెందాల్సిన ఆస్తిని అన్నలు ఇద్దరూ కుమ్మక్కై ‘చెరిసహాయ స్వాహా!’ చేసేసుకున్నారు. తమ్ముడు వచ్చి నా సొమ్ము ఇమ్మని అడిగితే.. ‘నీ కొమ్ముకాచే ముసలివాడు.. మన తండ్రి ఇంకా బతికే ఉన్నాడుగా! ఆయనే నీ వాటా, పట్టుకెళ్లు’ అన్నారు అన్నదమ్ములు. భాగం లేదు పొమ్మన్నారు, కనుక ‘నాభాగ’ అన్న నామం సార్థకమయింది.
జరిగినదంతా నాభాగుడు తండ్రికి తెలిపాడు. అప్పుడు నభగుడు… ‘నాయనా! బాధపడకు. అంగిరసులనే బ్రాహ్మణులు మనకు దగ్గరలోనే గొప్ప సత్త్రయాగం చేస్తున్నారు. వారు మేధావులైనా యాగంలో ఆరవనాటి కర్మకాండను తెలుసుకోలేని మూఢులవుతారు. నువ్వు వెళ్లి వారికి అవసరమైన రెండు వైశ్వదేవ సూక్తాలు మంత్రార్థంతో సహా వినిపించు. వారు సంతుష్టులై స్వర్గానికి వెళుతూ యాగంలో మిగిలిన ధనం నీకు దక్షిణగా ఇస్తారు’ అన్నాడు. అన్నప్రకారమే జరిగింది. కాని, ఆ ధనం తెచ్చుకొనే సమయంలో రుద్రుడు అడ్డుతగిలి ‘యజ్ఞశేషం నీది కాదు, నాదే. కాదంటే మీ నాన్నగారి నిర్ణయం తెలుసుకు రా, నేను అంగీకరిస్తా’ అన్నాడు. వెళ్లి అడుగగా ‘నిజమే నాయనా! ఆ ధనం రుద్రదేవతకే చెందుతుంది. ఇది మహర్షుల నిర్ణయం’ అని తెలిపాడు తండ్రి. నాభాగుడు తిరిగివచ్చి రుద్రునితో ‘దేవా! ఈ ధనం మీదేనని నా తండ్రి చెప్పాడు. నేను తప్పు చేశాను. క్షమించు’ అని పాదాలు పట్టుకొన్నాడు. నభగుని ధర్మానుకూల న్యాయ నిర్ణయానికి, నాభాగుని సత్య వచనానికి మెచ్చి మహాదేవుడు, నాభాగునికి ఆ సొమ్ముతోపాటు ఆత్మదర్శనాన్ని- బ్రహ్మజ్ఞానాన్ని కూడా అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
శా॥‘సప్తద్వీప విశాల భూభరము దోఃస్తంభంబునం బూని సం
ప్రాప్త శ్రీయుతుడై మహా విభవసంపచ్చాతురిం గల్గి దు
ర్వ్యాప్తిం జెందక వైష్ణవార్చనల మేరం గాలముం బుచ్చుచున్
సుప్తిం బొందక యొప్పె సద్గుణ గరిష్ఠుం డంబరీషుండిలన్’
నాభాగుని ధర్మదీక్షకు, నైతిక నిష్ఠకు మహాఫలంగా ఉత్తమ భక్తసంతానం ఆయనకు లభించింది. ఉదారమైన ఉత్కృష్ట నీతి ఉన్నచోటనే ఉత్తమ భక్తికి ప్రతిష్ఠ గదా! నాభాగునికి పరమ భాగవతుడైన అంబరీషుడు జన్మించాడు. ఈ ‘అంబరీషోపాఖ్యానం’ విశ్వంభరుని విశేష కృపకు, భక్తపాలన కళా సంరంభత్వానికి, భక్త పరాధీనత్వానికి ఉజ్జల దృష్టాంతం. దయ వేరు, కృప వేరు అన్న సూక్ష్మమూ, సున్నితమూ అయిన విషయం ఈ ఉపాఖ్యానంలో రసరమ్యంగా నిరూపితమైంది. ‘అంబరం’ అంటే ఆకాశం. ‘ఈశః’ అంటే ఈశ్వరుడు- భగవంతుడు. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం వలె విష్ణువును సర్వత్ర- లోపల వెలుపల వ్యాపకంగా వీక్షించువాడే అంబరీషుడు. ఇది ‘భాగవత రహస్యం’లో డోంగ్రే మహారాజ్ గారి వ్యాఖ్య.
అంబరమనగా వస్త్రమని కూడా అర్థం. విష్ణువును వస్త్రం వలె కప్పుకొని, ఆ స్వామి రక్షణలో ఉన్న నాకు ఎప్పటికీ ముప్పు వాటిల్లదన్న అఖండ విశ్వాసం కలవాడే అంబరీషుడని అధ్యాత్మపరంగా అంతరార్థం. అంబరీషునిది వైధీభక్తి. భక్తి శాస్త్రం బోధించే విధి విధానాలకు- నియమాలకు లోబడి తు.చ తప్పక ప్రవర్తిల్లే భక్తి. ‘షడ్విధా శరణాగతిః’ అని గతంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలో వివరించిన, శరణాగతికి ఆవశ్యక అంగాలైన ఆరు లక్షణాలూ సలక్షణంగా సమ్మిళితమై ఉన్న రాజీపడని భక్తి అంబరీష మహారాజుది. ‘ఆ మహాభక్తుని పట్ల తిరుగు- అడ్డులేని బ్రాహ్మణ శాపం కూడా నడ్డి విరిగి వ్యర్థమైపోయింది’ అని శుకముని పలుకగా విని పరీక్షిత్తు- ‘ధీమణీ! దాటరాని అవనీసుర (బ్రాహ్మణ) శాపం ఎందుకని అంబరీషుని ఏమీ చేయలేకపోయింది? నాకు విన వేడుకగా ఉంది. వివరించమ’ని వేడగా బాదరాయణి (శుకుడు) మోదమంది, సాదరంగా ఇలా వినిపించాడు… రాజా!
సద్గుణ గరిష్ఠుడు, సద్భక్త వరిష్ఠుడు, భగవన్నిష్ఠుడు అయిన అంబరీషుడు ఏడు ద్వీపాలతో కూడిన అవనీ (భూ) భారాన్ని తన భుజ స్కంధాలపై మోస్తూ, సకల శుభాలతో కూడిన మహావైభవోపేతమైన సంపదలు కలిగి ఉన్నా, సంసార బంధాలకు చిక్కకుండా, దుష్ప్రవర్తన- చెడు నడతకు లోను కాకుండా, అప్రమత్తుడై- విషయలోలత్వం లేక, భక్తి నియమాలను పట్టుదలతో పాటిస్తూ, కాలం వెళ్లబుచ్చుతూ లోకంలో ఎంతో ప్రశస్తిపొందాడు.
సీ॥ ‘చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద,
పలుకులు హరిగుణ పఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద,
శ్రవములు హరికథా శ్రవణమంద
చూపులు గోవింద రూపవీక్షణమంద,
శిరము గేశవ నమస్కృతుల యంద
పదములీశ్వరగేహ పరిసర్పణములంద,
కామంబు చక్రి కైంకర్యమంద’
తే॥‘సంగమచ్యుత జనతను సంగమంద
ఘ్రూణ మసురారి భక్తాంఘ్రి కమలమంద
రసన తులసీ దళములంద, రతులు పుణ్య
సంగతుల యంద యా రాజ చంద్రమునకు’
ఆ రాజచంద్రుని దినచర్యను, దివ్య చరిత్రను మధుర మంజులంగా పాఠక హృదయాలు రంజిల్లే విధంగా వర్ణించిన భక్త కవి సార్వభౌమునికి ప్రణామాంజలి ఘటిద్దాం. శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా!
ఆ మహాభాగవతుని ఎద- మనసు ఎప్పుడూ మాధవుని పాదపద్మాలపై తుమ్మెద వలె వ్రాలి ఉంటుంది. ఆయన వాక్కుకు వాసుదేవుని గుణ సంకీర్తనం వ్యసనం, కరా (చేతు)లకు వరాలిచ్చే ఇందిరావరుని మందిరాలను పొందికగా శుభ్రపరచి అందగించడం వ్యసనం. చెవులకు చవులూరించే చక్రహస్తుని కథలు వినడం వ్యసనం. చూపులకు కమలాక్షుని రూపాన్ని వీక్షించడం వ్యసనం. శిరస్సుకు శ్రీపతికి నతులొనర్చడం వ్యసనం. పాదాలకు పరమాత్ముని పవిత్ర ఆలయాలకు ప్రదక్షిణలు చేయడం వ్యసనం. ఆయన కోరికకు కేశవ కైంకర్యం- సేవ వ్యసనం. విష్ణు భక్తులతోటి చెలిమియే ఆ పరమ వైష్ణవుని కలిమి. అచ్యుత భక్తుల అంఘ్రి (పాద) పద్మాలను ఆఘ్రాణించడంలోనే ఆయన నాసికకు ఆనందం. రసన (నాలుక)కు తులసీదళాలయందే వ్యసనం. ఆ ధన్యజీవికి సర్వశరణ్యుని పుణ్య విషయాలలోనే ప్రేమాసక్తులు ప్రబలంగా ఉండేవి!(సశేషం)
‘అంబరం’ అంటే ఆకాశం. ‘ఈశః’ అంటే ఈశ్వరుడు- భగవంతుడు. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం వలె విష్ణువును సర్వత్ర- లోపల వెలుపల వ్యాపకంగా వీక్షించువాడే అంబరీషుడు. ఇది ‘భాగవత
రహస్యం’లో డోంగ్రే మహారాజ్ గారి వ్యాఖ్య.
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006