శివయ్యను కీర్తించే మాసం.. విష్ణుమూర్తిని ఆరాధించే మాసం..
మంచు తెరలు.. సిరివెన్నెల సిరులు.. అనంతదీపాలు.. ఆనందాల వెలుగులు..
సముద్ర స్నానాలు.. సామూహిక భోజనాలు.. కలగలిసిన పవిత్రమాసం కార్తికం.
ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకునే అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది
ఈ మాసం. శరత్ వెన్నెల వెలుగుల్లో కార్తిక కాంతుల్లో తరిద్దాం!
భారతీయ సంప్రదాయంలో తనను తాను తెలుసుకునే ప్రతి ప్రయత్నమూ ఒక ఇష్టి (యజ్ఞం)గా భావిస్తారు. నక్షత్రేష్టిలో కృత్తికతో మొదలుపెట్టి భరణి వరకు గణించడం సంప్రదాయం.
‘న కార్తిక సమో మాసః- కార్తిక మాసానికి సమానమైన నెల లేదు’ అంటుంది స్కాంద పురాణం. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కలిగిన మాసం కాబట్టి దీనిని కార్తికం అంటారు. జ్యోతిష శాస్త్రం రీత్యా నీటి మీద, మనిషి మనసు మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు కార్తికంలో చాలా శక్తిమంతంగా ప్రకాశిస్తుంటాడు. అందుకే ఈ నెలను కౌముదీ మాసం అని కూడా అంటారు. సర్వవ్యాపి అయిన భగవత్ శక్తిని సాధకుడు తన సాధనా పటిమను అనుసరించి విష్ణువుగా, శివుడిగా, మరొక దేవతగా గుర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. అందుకే ఈ కార్తిక మాసంలో సాధకులు శివ, కేశవ, లలితాదేవి ఆరాధనలు విశేషంగా చేస్తుంటారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ నెలలో చేసే పూజలు, వ్రతాల వల్ల సదాశివుడు ప్రసన్నుడు అవుతాడని, జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
దీపారాధన ఆంతర్యం..
సాధారణంగా మానవులకు మూడు విధాలైన లౌకిక ఇబ్బందులు ఉంటాయి. అవే దారిద్య్రం, అనారోగ్యం, ఆదరణ లేకపోవడం. దానగుణం దారిద్య్రాన్ని తొలగిస్తుంది. సమయపాలన, స్నాన ధ్యాన యోగాదులు నిర్వహించడం, చుట్టూ ఉన్న వారందరికీ ఆరోగ్యం కలగాలని ప్రార్థించడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ‘సర్వేజనాః సుఖినోభవంతు’ అని కోరుకోవడం వల్ల ఆదరణ లభిస్తుంది. అలాగే అహంకార, మమకార, సంకల్పాలు ఆధ్యాత్మికమైన ఇబ్బందులు. సంకల్పం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.
సంకల్పించిన దాని పరిణామాలు జ్ఞానం వల్ల అవగతం అవుతాయి. వాటి పరిణామాలు తెలిస్తే ఆ కార్యం అవసరమో, కాదో అని ఆలోచిస్తాం. దానితో సంకల్పం లయమవుతుంది. ఏకాత్మ భావన వల్ల అహంకారం లయమవుతుంది. సర్వభూతాలను పాలించే తల్లి ఆ ఆదిశక్తే అని విశ్వసించడం, ‘నన్ను, నా వారిని కాపాడే బాధ్యత ఆ తల్లిదే’ అనే సర్వ సమర్పణా భావన చేస్తే మమకారాన్ని జయించగలం. అలాగే కోరికలు, వాటికి మూలమైన సంబంధిత వాంఛలు అపకారం చేస్తాయి. వాటిని విడనాడాలి. ఈ ఆరింటినీ పొందాలి అంటే జ్ఞానం అవసరం. దానికి ప్రతీక జ్యోతి ప్రజ్వలనం. దీపం జ్యోతి స్వరూపం. ఆత్మలో వెలిగే జ్ఞాన జ్యోతిని గుర్తించి, దానిని వెలిగించి, ఆ కాంతిలో మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దానికి ప్రతీకగా బాహ్యంగా దీపాన్ని వెలిగించి దైవారాధన చేస్తాం. కార్తికం నెల పొడవునా, ముఖ్యంగా పౌర్ణమినాడు.. శివాలయాల్లో, విష్ణుమూర్తి ఆలయాల్లో దీపారాధన చేయడం వెనుక ఆంతర్యం ఇదే అంటారు పెద్దలు.
కార్తిక స్నానం ఆరోగ్యకరం
ఎడమభాగంలో పార్వతి, కుడివైపు పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా సదాశివుడు దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోషకాలంలో శివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ నెలలో సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ ఉత్తమం అని కార్తిక పురాణం పేర్కొన్నది. సాధ్యం కాకపోతే నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేయవచ్చని పండితులు చెబుతారు. కార్తిక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండల్లో, కోనల్లో ప్రవహిస్తూ ఔషధ వృక్షాలు, మొక్కలను ఒరుసుకుంటూ పారుతాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల సారం నదీజలాల్లో కలుస్తుంది. కార్తిక చంద్రకిరణ స్పర్శతో అందులో ఉండే ఔషధీగుణాలు ద్విగుణీకృతం అవుతాయి. ఈ జలాల్లో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని పెద్దల మాట.
ఏకబిల్వం శివార్పణం
శివార్చనలో బిల్వపత్రం (మారేడు) శ్రేష్ఠమైనది. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయ కోణం కనిపిస్తుంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడం వల్ల మేలు జరుగుతుంది. మారేడు వృక్షం నుంచి ప్రసరించే గాలి బాహ్య, అంతర కణాలను పరిశుభ్రం చేసి, దేహాన్ని పరిపుష్ఠం చేస్తుంది. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుందని అంటారు. మారేడు జఠరాగ్నిని ఉత్తేజపరుస్తుంది. వాత లక్షణాల్ని తగ్గిస్తుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని నియంత్రిస్తుంది. మారేడు ఉత్పత్తులు గుండె సంబంధమైన వ్యాధులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది.
వన భోజనం..
కార్తికంలో సామూహికంగా జరుపుకొనే ఉత్సవం వన భోజనం. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరితో కలిసి ఒకరోజంతా ప్రకృతి సమక్షంలో ఆనందంగా గడిపి రావడమే వనభోజనాల ఆంతర్యం. ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడం’ అని అర్థం. వనభోజనాల ద్వారా అనుబంధాలు మరింత గట్టిపడతాయి. అంతేకాదు ప్రకృతి ఒడిలో ఒక రోజంతా గడిపితే వచ్చే మానసిక ఉల్లాసం మరే వినోదంలోనూ ఉండదు. అందుకే కార్తిక మాసం వనభోజనాల కోసం ఎదురుచూస్తుంటారు. బృందాలుగా అడవితల్లి ఒడిలో వేడుక చేసుకుంటారు. ఉసిరి, రావి తదితర వృక్షాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు వ్రతాలు, పూజలు, అభిషేకాలు, వనభోజనాలు ఇలా కార్తిక మాసంలో చేసే క్రతువులన్నీ సమష్టిగా నిర్వహించేవే. వీటివల్ల సమాజం పరస్పర ఆధారితం అనే పరివర్తన కొందరిలోనైనా కలుగుతుంది.
కర్మఫలాలను దూరం చేసుకుందాం
పుట్టిన ప్రతిజీవి కర్మలు చేస్తాడు. చేసేది పుణ్యకర్మమైనా, పాపకర్మమైనా కర్మఫలాన్ని అనుభవించాలి. దానికి మరోజన్మ ఎత్తడం తప్పనిసరి. వాటిని దూరం చేసుకోవాలంటే నియమబద్ధంగా వ్రతాలు ఆచరించడమే మార్గం. అలాగని భౌతిక జీవనాన్ని వదులుకోలేం. అందుకే పూజాదికాలు, వ్రతాలు శ్రద్ధగా నిర్వహిస్తూ ఆ ఫలితాన్ని ఆయా దేవతలకు సమర్పిస్తూ జీవితాలను ఉన్నతంగా మలుచుకోవాలని సనాతన ధర్మం బోధిస్తున్నది. భౌతిక జీవనంలో ప్రగతి, ఆధ్యాత్మిక జీవనంలో సుగతిని సాధించే క్రమంలో రెంటిని సమన్వయం చేసుకునే విధానమే ఈ వ్రతాలు, ఆరాధనలు, నియమాలు.
కార్తికంలో శివలింగార్చన ముఖ్యమైనదిగా చెబుతారు. శివం అంటే అఖండమైన ఆనందం అని అర్థం. ‘అన్నీ దేనిలో లీనమై ఉన్నాయో, అన్నిటిలో ఏది లీనమై ఉన్నదో దానిని లింగం’ అంటారు. అంటే అంతటా ఉన్నది ఒకే చైతన్యం. అదే లింగరూపంగా విస్తరించి ఉన్నది. అందుకే ‘లింగ గర్భం జగత్ సర్వం’ అంటారు. ఆ చైతన్యమే పగలు, రాత్రిగా ప్రకటితమవుతుంది. పగలు శివతత్త్వానికి, రాత్రి విష్ణుతత్త్వానికి ప్రతీకలు. అలాగే అగ్నితత్త్వం శివుడికి, జలతత్త్వం విష్ణువుకు ప్రతీకలుగా నిలుస్తాయి.
లలితాదేవిని ‘శాంభవీ శారదారాధ్యా శరశ్చంద్ర నిభాననా’ అని స్తుతించాయి లలితా సహస్రనామాలు. సంతోషాన్ని కలిగించే చిచ్ఛక్తిని శాంభవి అంటారు. ‘స్వచ్ఛమైన శారదాదేవి లలితాంబను ఆరాధిస్తుంటుంది. శరత్కాల చంద్రుడిలా ప్రకాశించే ముఖం కలిగిన దేవత లలిత’. ఈ మాసంలో లలితార్చన ముక్తినిస్తుందని సాధకుల విశ్వాసం.
పాలకుర్తి రామమూర్తి