దేవుణ్ని ఎలా పిలవాలి? ఏమని కొలవాలి? కీర్తనలతో అర్చించాలా..? స్తోత్రాలతో కీర్తించాలా..? అల్లంత దూరాన ఉన్న కొండంత దైవం తక్షణ రక్షణగా రావాలంటే ఎలా? ఓంకార నాదాన్ని సంధానం చేసి పిలిస్తే.. ఏదో మంత్రం వేసినట్టు మన వశమవుతాడు భగవంతుడు! ఐంకార బీజంతో తలిస్తే.. మనోవాక్కాయ కర్మలను నెర వేరుస్తాడు. క్లీంకారంతో కొలిస్తే.. కోరింది ఫలింపజేస్తాడు. బీజాక్షరాలతో కూడిన మహత్తరమైన మంత్రాలు మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసే చైతన్యదీపాలు. మంత్రంలోని ప్రతి అక్షరం వెనుకా మాటల్లో వర్ణించలేనంత గొప్ప శక్తి దాగి ఉంటుంది. భక్తుడు నిరంతర సాధన ద్వారా ఈ శక్తిని పొందగలుగుతాడు.
‘మంత్రం’ అనే పదానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. పద వ్యుత్పత్తి ప్రకారం పరిశీలిస్తే, ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’- నిరంతరం మననం చేసే వారిని రక్షించేది మంత్రం అని అర్థం. మరొక కోణంలో పరిశీలిస్తే, మంత్రం అనే పదంలో ‘మ’ అంటే మననం చెయ్యటం. ‘త్రం’ అంటే ‘త్రాణం’ (రక్షించేది అని అర్థం). అదేపనిగా, మంత్రాన్ని నిశ్చలమైన భక్తితో ఉపాసన చేసినట్లయితే, ఆ మంత్రశక్తి మరింతగా పెరుగుతుంది. మంత్రానికి అధిష్ఠాన దేవత అనుగ్రహం కలుగుతుంది. అందుకే మననం చేసేవారిని రక్షించేది మంత్రం అయింది.
దేవతలు మంత్రాధీనులు
ఆలయంలో కంటికి కనిపించే దేవతామూర్తుల విగ్రహాలు సగుణ స్వరూపం అయితే, మంత్రం అనేది నిర్గుణ స్వరూపానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎలాగైతే, విత్తనం అతి చిన్నగా ఉండి, క్రమంగా పెరిగి అతిపెద్ద వృక్షంగా మారుతుందో, చిన్నగా కనిపించే మంత్రం, భక్తుడు చేసే సాధన ద్వారా అనంతమైన శక్తిని సంపాదించుకుని, అతణ్ని సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తుంది. ‘మంత్రాధీనో దేవతాః’- దేవతలు మంత్రాలకు అధీనమై ఉంటారని శాస్ర్తాలు చెబుతున్నాయి. మొత్తం ప్రపంచమంతా దైవానికి ఆధీనమై ఉంటే, దైవం మాత్రం మంత్రానికి కట్టుబడి ఉంటుంది. అదీ మంత్రానికి ఉన్న గొప్ప శక్తి. కాబట్టి, మంత్రాన్ని ఏవో కొన్ని అక్షరాల సమూహంగానో, కొన్ని శబ్దాల అపరిమితమైన ఉచ్చారణగానో భావించకూడదు. ఇందుకు సంబంధించిన పురాణగాథ మహాభారతంలో ఉంది.
జనమేజయుడు సర్పయాగం తలపెట్టాడు. ప్రపంచంలోని పాములన్నీ యజ్ఞగుండంలో పడి మరణిస్తున్నాయి. ఆ యజ్ఞం చేయిస్తున్న రుత్విక్కులు చదువుతున్న మంత్రశక్తి వల్లే ఇదంతా సాధ్యమైంది. మంత్రం చదివి, పాము పేరు చెప్పగానే ఆ పేరు కలిగిన సర్పం యజ్ఞగుండంలో పడి ప్రాణం విడుస్తున్నది. ఇలా, కొన్ని వేల సర్పాలు కన్నుమూశాయి. తర్వాత వంతు తక్షకుడిది. ప్రాణభయంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్లి, శరణు కోరాడు. ఇంద్ర సింహాసనం పాదపీఠానికి తక్షకుడు చుట్టుకుని పడుకున్నాడు. భూలోకంలో యజ్ఞం నిర్వహిస్తున్న రుత్విక్కులు తక్షకుడి పేరుతో మంత్రం పఠించారు. అతను రాలేదు. మరోసారి చదివారు. అయినా… తక్షకుడు రాలేదు. విషయం తెలుసుకొని, ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ అన్నారు. మరుక్షణంలో పాదపీఠం, సింహాసనం సహా ఇంద్రుడూ యాగమంటపానికి వచ్చేశాడు. అదీ మంత్రానికి ఉన్న మహిమ. తర్వాత జరిగిన పరిణామాల్లో జనమేజయుడు యాగం విరమించుకుంటాడు. ఆ కథ సంగతి అటుంచితే, దేవతల్ని కూడా కదిలించగలిగిన శక్తి మంత్రాలకు ఉందని ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది.
శక్తి-శబ్దం-స్పందన
అత్యంత శక్తిమంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలో స్పందన ఉంటుంది. మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే, ఆ మంత్రంలో ఉన్న బీజాక్షరాల్లో స్పందన కలిగి, అత్యద్భుతమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. మంత్రాల నుంచి ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు అమోఘమైన శక్తి కలిగి ఉంటాయి. ఇవి జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ మంత్రశక్తి సాధకుడి అణువణువులో వ్యాపిస్తుంది. మంత్రం జపించడానికి ముందు, అతనిలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. భక్తుడిలో అంతర్గతంగా ఉన్న దైవికమైన శక్తులు జాగృతం అవుతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య మాలిన్యాలు తొలగిపోతాయి. మనసు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని చేరుకుంటుంది.
బీజాక్షరం దైవ స్వరూపం
జీవుల్లో ఉండే ఆంతరిక శక్తులతోపాటు ప్రకృతిలో ఉండే అదృశ్య శక్తుల్ని కూడా మంత్రాల్లో ఉండే బీజాక్షరాలు ప్రేరేపిస్తాయి. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడం మొదలైన వాటిని శబ్ద తరంగాల ప్రక్రియతో మన పూర్వికులు సాధించి చూపించారు. అణువులను కదిలించే శక్తి శబ్ద తరంగాలకు ఉండటం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. తదేక లక్ష్యంతో మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే భక్తుడు చేస్తున్న సాధన ఫలిస్తుంది. అయితే, కేవలం నోటిమాటగా మంత్రాన్ని పలకటం వల్ల ఫలితాలు కలగవు. ఏకాగ్రతతో, త్రికరణ శుద్ధిగా జపం చేయాలి. తాను నమ్ముకున్న దైవం పట్ల, ఎంచుకున్న మంత్రం పట్ల, మంత్రోపాసన చేసిన గురువుపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. అప్పుడే మంత్రం ఫలిస్తుంది. మంత్రశక్తి మనం కోరుకున్న ఫలితాలను అందిస్తుంది.
శబ్ద తరంగాల విలాసం..
శాస్త్రం చెప్పినవిధంగా సాధన చేస్తే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్చక్రాలపైనా, శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తాయి. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ద తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి విడుదలైన మంత్ర శబ్ద తరంగాల ప్రభావం ప్రతి అవయవాన్నీ శక్తిమంతం, చైతన్యవంతం చేస్తుంది. ఇదొక అద్భుతమైన శబ్దశాస్త్ర విజ్ఞానం. పెద్దలు మనకిచ్చిన అత్యంత శక్తిమంతమైన ముక్తిసాధనం మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరుడి అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథాసంపత్తిని పొందిన మానవుడికి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే.
గురువు ఉపదేశించాకే..
మన వాఙ్మయంలో ప్రతి అక్షరమూ బీజాక్షరమే. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపమే. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ప్రకటితమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం అవుతుంది. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి దేవతకు వారి వారి మూల బీజాక్షరాలను వాడటం ద్వారా మంత్రాన్ని మరింత శక్తిమంతం చేయొచ్చు.
మంత్రాణి పల్లవోపేతం బీజశక్తి సమన్వితం యథా తంత్రకృతం జప్త్యా సద్యస్సిద్ధి ప్రదం స్మృతం॥
మంత్రాలన్నీ మనం ఎంచుకున్న కామ్యాలకు (పనులు) సంబంధించి ఉంటాయి. ఇవన్నీ బీజాక్షరాల శక్తితో నిండి ఉంటాయి. ఇటువంటి మంత్రాల్ని శాస్త్రం చెప్పినట్లుగా ఉపాసన చేస్తేనే సత్ఫలితాలను ఇస్తాయి. బీజాక్షరాలను (మంత్రాలు) గురువు దగ్గర ఉపదేశం పొందిన తర్వాత మాత్రమే అనుష్ఠానం చెయ్యాలి. మంత్రంలో స్వరలోపం కానీ, వర్ణ (అక్షర) లోపం కానీ వస్తే తీవ్ర ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది.
అవగాహన ప్రధానం
అక్షరాల సంఖ్యను బట్టి మంత్రాలు 5 రకాలుగా ఉంటాయి. ఒకే అక్షరం ఉంటే దాన్ని పిండం అంటారు. రెండు అక్షరాలు ఉంటే కర్తరి, మూడు నుంచి 9 అక్షరాలు ఉంటే బీజం, 10 నుంచి 20 అక్షరాలు ఉంటే మంత్రం, 20 కన్నా ఎక్కువ అక్షరాలు ఉంటే అది మాలా మంత్రం అవుతుంది. మాటకు అర్థం తెలియకపోతే ఎంత వ్యర్థమో, మంత్రంపై అవగాహన లేకపోయినా అంతే వ్యర్థం. మంత్రాన్ని, అధిష్ఠాన దేవతను సంపూర్ణంగా అవగాహన చేసుకొని, నమ్మికతో, శ్రద్ధగా మననం (జపం) చేస్తే సత్వర ఫలితాలు లభిస్తాయి. అలాకాకుండా ఎన్ని కోట్లసార్లు జపం చేసినా ఫలితం ఉండదు. ఉపాసనగా మంత్రాన్ని జపించాలనుకుంటే కొన్ని మంత్రాంగాలను పాటించాలి. ముందుగా మంత్రానికి మూలమైన రుషికి నమస్కరించాలి. మంత్ర నిర్మాణ ఛందస్సు తెలుసుకోవాలి. మంత్రాధిదేవత రూపాన్ని తలచుకోవాలి. మంత్రానికి సారభూతమైన శబ్ద స్పందనవల్ల కలిగే శక్తిని గ్రహించి నిలుపుకోవాలి. మంత్రోపాసన చేసే సమయం కీలకం. ఉపాసకునికి అధిక శక్తిని ఇస్తుంది.
బీజాక్షరం – సంకేతం
ఓం – ప్రణవ బీజం. సృష్టికి మూలం
హ్రీం – శక్తి బీజం/ మాయా బీజం
ఈం – మహామాయ
ఐం – వాక్ బీజం
క్లీం – మన్మథ బీజం
సౌః – సౌభాగ్య బీజం
ఆం – పాశబీజం
క్రోం – అంకుశ బీజం
హ్రాం – సూర్య బీజం
సోం – చంద్ర బీజం
లం – ఇంద్ర బీజం, పృథ్వీ బీజం
వం – వరుణ బీజం, జల బీజం
రం – అగ్ని బీజం
హం – ఆకాశ బీజం, యమ బీజం
యం – వాయు బీజం
శం -ఈశాన్య బీజం, శాంతి బీజం
– డాక్టర్ కప్పగంతు రామకృష్ణ