ఒక మహిళ గాబరాగా వచ్చి ఆశ్రమంలోని గురువును కలిసింది. తన భర్త చాలా మంచివాడని, అయితే అత్తమామలను భరించలేకపోతున్నానని, వారి పోరు లేకుండా చేయమని వేడుకుంది. బాగా అలసినట్లు అనిపించిన ఆ మహిళకు, శిష్యులచేత వేడి పాలు ఇప్పించాడు గురువు. మీగడ సహా పాలను తృప్తిగా తాగిందామె. అయినా ఆమె ఆకలి తీరలేదని గురువు గుర్తించాడు. ‘బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు.. చక్కటి పాల మీగడను చేసుకుని తిను’ అంటూ ఖాళీ పాలగిన్నెను ఆమె చేతికి ఇచ్చాడు. గిన్నె ఖాళీగా ఉండటం చూసి ‘పాలు ఇప్పించండి’ గురువుగారు అన్నదామె. గురువు చిన్న నవ్వు నవ్వి ‘పాలమీగడ చేయడానికి పాలు ఎందుకు?’ అని ప్రశ్నించాడు. ఆమె ఆశ్చర్యంగా ‘పాలు లేకుండా, పాలను వేడి చేయకుండా మీగడ ఎలా వస్తుంది’ అంది. గురువు నవ్వుతూ ‘అవును! పాలు లేకుండా మీగడ లేదు.
మనసు పెట్టి చూస్తే, పాలు నీ అత్తమామలైతే, నీ భర్త మీగడ. ఆ ఇద్దరూ లేకుంటే నీ భర్త ఈ ప్రపంచంలోకే వచ్చి ఉండడు’ అన్నాడు. ‘మీగడ కోసం పాలను బాగా వేడి చేసినట్టే.. మీ అత్తమామలు తమ కొడుకు భవిష్యత్తు కోసం పడ్డ కష్టాన్ని వేడిగా భావించు. వేడి ఎంత ఎక్కువైతే పాలు అంత బాగా కాగుతాయి, మీగడ అంత రుచిగా ఉంటుంది. వారు ఎంతగానో కష్టపడి నీ భర్తను ప్రయోజకుణ్ని చేశారు. నీకు భర్త కావాలంటే, అత్తమామలనూ ఆదరించాల్సిందే!’ అన్నాడు గురువు. ఆ మాటలకు ఆమె మనసు.. సెగ తగిలిన వెన్నయింది. లేచి బయల్దేరుతుండగా ఆశ్రమంలోని శిష్యులు చిన్న గిన్నెలో చక్కెర వేసిన పాలమీగడను తెచ్చి ఆమె చేతికి ఇచ్చారు. దాన్ని తృప్తిగా తిని గురువుకు నమస్కరించి అత్తమామల బాగోగులు చూసుకునేందుకు ఇంటికి బయల్దేరింది.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821